Chandigarh: పెట్రోల్‌ బైక్‌ల రిజిస్ట్రేషన్లు బంద్‌..!

విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించే దిశగా చండీగఢ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌ ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్లను 35 శాతం తగ్గించింది. ఈ లక్ష్యం నెరవేరడంతో ఫిబ్రవరి 10 నుంచి వాటి రిజిస్ట్రేషన్లను నిలిపేసింది.

Published : 11 Feb 2023 21:45 IST

చండీగఢ్‌: పర్యావరణ అనుకూల రవాణావ్యవస్థ దిశగా విద్యుత్‌ వాహనాల(Electric Vehicles)ను ప్రోత్సహించేందుకు చండీగఢ్‌(Chandigarh) పాలనాయంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌(Vehicle Registration)లను తాత్కాలికంగా నిలిపేసింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన ‘విద్యుత్‌ వాహనాల విధానం(EV Policy)’లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది.

విద్యుత్‌ వాహనాలు కానివాటిని పరిమితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే నాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల రిజిస్ట్రేషన్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. నాలుగు చక్రాల వాహనాల్లో 10 శాతం, ద్విచక్ర వాహనాల్లో 35 శాతం రిజిస్ట్రేషన్లను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ఇది పూర్తికావడంతో.. ఫిబ్రవరి 10 నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపేసింది.

ఫిబ్రవరి 10, ఆపై కొనుగోలు చేసిన ఇంధన ఆధారిత ద్విచక్ర వాహనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు(మార్చి 31) చండీగఢ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయబోమని పాలనాయంత్రాంగం తేల్చిచెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభం అవుతుందని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24)లో రిజిస్ట్రేషన్లను 65 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఆపై వాహనాలను వేరే ఇతర చోట రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇలా 2024 నాటికి ఇంధన ఆధారిత ద్విచక్ర వాహనాలు, ఆటోల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయనున్నారు. 2024 నుంచి మూడేళ్లలో ఇంధన ఆధారిత వ్యక్తిగత కార్ల రిజిస్ట్రేషన్లను కూడా 30, 40, 50 శాతానికి తగ్గించాలని అధికార యంత్రాంగం యోచిస్తున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని