ChatGPT: చాట్‌జీపీటీ సంచలనం.. రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు

ఇటీవల ఎక్కువగా వార్తల్లో కొత్తగా వినిపిస్తోన్న పేరు చాట్‌జీపీటీ (ChatGPT). ఈ చాట్‌బోట్‌ (chatbot) తక్కువ సమయంలోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది.

Updated : 04 Feb 2023 12:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతిక యుగంలో సరికొత్త సంచలనమైన చాట్‌జీపీటీ (ChatGPT) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కృత్రిమమేధ  (AI) ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న యాప్‌గా అవతరించింది. ఈ చాట్‌బోట్‌ (chatbot) కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. చాట్‌బోట్‌ జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ సహా ఇతర సోషల్‌మీడియా యాప్‌లను అధిగమించి తక్కువ సమయంలోనే 100 మిలియన్‌ యూజర్లను దక్కించుకున్న యాప్‌గా ఘనత సాధించింది. ఇతర యాప్‌లు ఈ మైలురాయిని చేరటానికి దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు పైగా పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గతేడాది డిసెంబర్‌లోనే చాట్‌జీపీటీని తీసుకొచ్చారు. దీన్ని అభివృద్ధి చేసేందుకు ఎలాన్‌మస్క్‌ (Elon musk)కూడా పెట్టుబడులు పెట్టారు. కృత్రిమమేధ సాయంతో పనిచేసే ఈ చాట్‌బోట్‌ యూజర్‌కు అవసరమైన సమాచారాన్ని కచ్చితత్వంతో చూపిస్తుంది. అందుకే అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. గత 20 ఏళ్లుగా ఇంత వేగంగా వినియోగదారులకు చేరువైన యాప్ లేదని యూబీఎస్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. గత వారం రోజులుగా రోజుకు 25 మిలియన్‌ వీక్షకులు ఈ chat.openai.com వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. జనవరి 31న చాట్‌జీపీటీని రికార్డు స్థాయిలో వినియోగించారట. సాధారణ రోజుల్లో 15.7 మిలియన్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తే.. జనవరి 31న ఆ సంఖ్య 28 మిలియన్లుగా ఉందని సిమిలర్‌వెబ్‌ గణాంకాలు పేర్కొన్నాయి.

చాట్‌జీపీటీ వినియోగం పెరిగిపోతే గూగుల్‌తో పాటు ఇతర ఇంటర్నెట్‌ దిగ్గజాల వృద్ధి రేటు ఆందోళనకరంగా మారనుందన్న వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై గూగుల్‌ (Google) సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో చాట్‌జీపీటీ తరహా సేవలను పరిచయం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చైనా (China)కు  చెందిన బైడూ కూడా సొంతంగా చాట్‌జీపీటీని అభివృద్ధి చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఓపెన్ఏఐ ఇటీవల చాట్‌జీపీటీ ప్లస్ మోడల్‌ను పరిచయం చేసింది. కేవలం అమెరికాలోని వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. నెలకు 20 డాలర్లతో సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని