ChatGPT: సీఈఓకు రూ.90 లక్షల మొండిబాకీ.. వసూలు చేసిన చాట్‌జీపీటీ

కృత్రిమ మేథతో పనిచేస్తోన్న చాట్‌జీపీటీ (ChatGPT) అద్భుతం చేసింది. ఓ సీఈఓకు రావాల్సిన రూ.90లక్షల మొండిబాకీని వసూలు చేయడంలో సాయం చేసింది.

Published : 27 Feb 2023 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ(ChatGPT). ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) తో పనిచేసే ఈ టూల్‌ గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ చాట్‌జీపీటీ సాయంతో ఓ సీఈఓ రూ.90లక్షల మొండిబాకీని వసూలు చేసుకోగలిగారు. చాట్‌జీపీటీ రాసిన మెయిల్‌కు భయపడి తనకు రావాల్సిన డబ్బును తిరిగిచ్చేశారని లేట్‌ చెక్అవుట్‌ అనే డిజైన్‌ స్టూడియో సీఈఓ గ్రెగ్‌ ఐసెన్‌బర్గ్‌ తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గ్రెగ్‌ ఐసెన్‌బర్గ్‌ (Greg Isenberg)కు చెందిన డిజైన్‌ కంపెనీ.. ఓ ప్రధాన బ్రాండ్‌కు డిజైన్‌ పనులు చేసిపెట్టింది. వారి పనికి మెచ్చి ఆ మల్టీ బిలియన్‌ డాలర్ క్లయింట్‌ వీరికి మరిన్ని ఆర్డర్లు ఇచ్చారు. అయితే ఆ పనికి 1,09,500 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90లక్షలు) చెల్లించాల్సి ఉండగా.. ఆ క్లయింట్‌ డబ్బులు ఇవ్వలేదు. దీంతో గ్రెగ్‌ ఐసెన్‌బర్గ్‌ చాట్‌జీపీటీ (ChatGPT) సాయం తీసుకున్నారు. ఈ టూల్‌ తనకు ఏ విధంగా సాయం చేసిందో వివరిస్తూ గ్రెగ్‌ వరుస ట్వీట్లు చేశారు.

‘‘డిజైన్‌, ఇంజినీరింగ్‌లో మా కంపెనీ వందలాది ప్రాజెక్టులు పూర్తిచేసింది. కానీ ఇలా డబ్బులు చెల్లించని క్లయింట్‌ను మేం చూడలేదు. ఈ పరిస్థితి మా బృందం నైతికతను దెబ్బతీసింది. దీంతో నేనే రంగంలోకి దిగాను. అయితే డబ్బులు అడుగుతూ మరో ఈమెయిల్‌ రాసినా ఎలాంటి ప్రయోజనం లేదనిపించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో లాయర్‌ ద్వారా లీగల్‌ నోటీసులు పంపాలి. అందుకు 1000 డాలర్ల వరకు ఖర్చయ్యేది. కానీ అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. చాట్‌జీపీటీ సాయం తీసుకున్నా. పరిస్థితి వివరించి.. ఆ క్లయింట్‌ను ‘భయపెడుతూ’ ఓ డ్రాఫ్ట్‌ రాసివ్వమని కోరారు. చాట్‌జీపీటీ (ChatGPT) ఇచ్చిన సమాధానంలో స్వల్ప మార్పులు చేసి ఆ డ్రాఫ్ట్‌ను క్లయింట్‌కు మెయిల్‌ చేశా. రెండు నిమిషాల్లో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ నుంచి నాకు స్పందన వచ్చింది. థాంక్యూ చాట్‌జీపీటీ (ChatGPT). నీ వల్లే నేను నా మొండి బకాయిని వసూలు చేసుకోగలిగా’’ అని గ్రెగ్‌ ట్విటర్‌లో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని