cyrus mistry: ప్రతిష్ఠ కోసమే సైరస్‌ పోరు

దేశంలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ వారసుల్లో ఒకరైన సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ హఠాన్మరణం, ఈ గ్రూప్‌కే కాక వ్యాపార ప్రపంచానికే తీరనిలోటని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నారు. గ్రూప్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన షాపూర్జీ పల్లోంజీ

Updated : 05 Sep 2022 12:50 IST

దేశంలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ వారసుల్లో ఒకరైన సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ హఠాన్మరణం, ఈ సంస్థకే కాక వ్యాపార ప్రపంచానికే తీరనిలోటని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన షాపూర్జీ పల్లోంజీ ఈ ఏడాది జూన్‌ 28న మరణించగా, ఇప్పుడు సైరస్‌ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. పదేళ్ల క్రితం టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవిని స్వీకరించడంతోనే సైరస్‌ మిస్త్రీ దేశీయంగా సామాన్యుల్లో సైతం ప్రాచుర్యం పొందారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ ఎంపికే కాదు.. ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించిన విధానం కూడా కార్పొరేట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2012 డిసెంబరు 28న రతన్‌ టాటా వారసుడిగా టాటా సన్స్‌ ఛైర్మన్‌గా 44 ఏళ్ల చిన్న వయస్సులోనే మిస్త్రీని ఎంపిక చేసినప్పుడు కార్పొరేట్‌ ప్రపంచం అచ్చెరువొందింది. 2016 అక్టోబరు 24న ఆ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికిన తీరూ పెను సంచలనమే.

1994లో షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను సైరస్‌ మిస్త్రీ స్వీకరించారు. 2001 సెప్టెంబరు 1న టాటాసన్స్‌ బోర్డులో చేరారు. 2011 నవంబరు కల్లా టాటా గ్రూప్‌లో 18.4 శాతంతో అతిపెద్ద వాటాదారుగా సైరస్‌ మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ మారారు. అప్పుడే టాటా గ్రూప్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ నియమితులవ్వడంతో, తమ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. 2012లో రతన్‌ టాటా వారసుడిగా టాటా గ్రూప్‌ పగ్గాలు చేపట్టేందుకు తొలుత మిస్త్రీ సుముఖత చూపలేదు. అయితే తమ కుటుంబంతో ఎంతో అనుబంధం కలిగిన రతన్‌ టాటా స్వయంగా వెళ్లి మాట్లాడటంతో ఒప్పుకున్నారు. టాటా గ్రూప్‌ సంస్థల నిర్వహణ తీరులో వినూత్న మార్పులు చేసే క్రమంలో, నాలుగేళ్లలోనే పరిస్థితులు మిస్త్రీకి వ్యతిరేకమయ్యాయి. ఫలితంగా టాటా గ్రూప్‌ తన ఛైర్మన్‌ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది. టాటా గ్రూప్‌ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్‌లో సైరస్‌ మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీకి గొప్ప పలుకుబడి ఉంది. ఆయన్ను అక్కడ ‘ఫాంటమ్‌ ఆఫ్‌ బాంబే హౌస్‌గా వ్యవహరించేవారు. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరాటం చేసినా, ఈ విషయంలో తండ్రి నుంచి తగిన మద్దతు లభించలేదనే చెబుతారు. తనను ఛైర్మన్‌ పదవి నుంచి ఎందుకు తొలగించారో కారణాలు చెప్పాలని టాటాలను మిస్త్రీ కోర్టుకు లాగారు.

టాటా గ్రూప్‌తో ఆరేళ్లుగా..

ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాక గ్రూప్‌ వ్యవస్థాపకుడు రతన్‌ టాటా, మేనేజింగ్‌ ట్రస్టీ ఎన్‌.వెంకట రమణన్‌ సహా ఉన్నతాధికారులపై మిస్త్రీ న్యాయపోరాటం చేశారు. ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ తొలగింపును సవాల్‌ చేస్తూ.. 2016 డిసెంబరులో మిస్త్రీ, ఆయన రెండు కుటుంబ నిర్వహణ సంస్థలు సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌లు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. 2018 జులై 9న ఈ పిటిషన్‌లను కొట్టివేసిన ఎన్‌సీఎల్‌టీ, మిస్త్రీ తొలగింపును సమర్థించింది. ఈ తీర్పుపై జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో మిస్త్రీ సవాల్‌ చేశారు. 2019 డిసెంబరులో మిస్త్రీకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఎస్‌సీఎల్‌ఏటీ.. ఆయన్ను మళ్లీ టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిలో నియమించాల్సిందిగా ఆదేశించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను 2020 జనవరిలో సుప్రీంకోర్టులో టాటా సన్స్‌ సవాల్‌ చేసింది. 2021 మార్చిలో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేయగా, మిస్త్రీ రివ్యూ పిటిషన్‌ వేశారు. ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చడంతో ఆరేళ్ల మిస్త్రీ- టాటా గ్రూప్‌ న్యాయ వివాదానికి తెరపడింది. అయితే అంతకుముందు తీర్పు సందర్భంలో, తనపై చేసిన వ్యాఖ్యలు ప్రతిష్ఠకు భంగకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ మిస్త్రీ కోరగా, ఆ వ్యాఖ్యలను మాత్రం సుప్రీంకోర్టు తొలగించింది.

ఆస్తుల విలువ

* ఎస్‌పీ గ్రూప్‌ నికర విలువ 3000 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.40 లక్షల కోట్లు). 50కి పైగా దేశాల్లో 50,000 మంది ఉద్యోగులు ఈ సంస్థకు ఉన్నారు.

* సైరస్‌ నేతృత్వంలో టాటా గ్రూప్‌ సంస్థల లాభదాయకత 42.3 శాతం వార్షిక వృద్ధితో సాగింది. గ్రూప్‌ టర్నోవర్‌ కూడా రెట్టింపై 100 బిలియన్‌ డాలర్లను అధిగమించింది.

* ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయ సముదాయం, బీఎస్‌ఈ టవర్స్, ముంబయిలోని ఒబెరాయ్‌ హోటల్, ఒమన్‌ సుల్తాన్‌ రాజమహల్, కోల్‌కతా తొలి మెట్రో వంటివి ఎస్‌పీ గ్రూప్‌ ప్రసిద్ధ నిర్మాణాల్లో కొన్ని.

* 2012లో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యాక, ఎస్‌పీ గ్రూప్‌ వ్యాపార కార్యకలాపాల నుంచి సైరస్‌ పూర్తిగా తప్పుకున్నారు.


చదువరి.. గోల్ఫ్‌ ఎంతో ఇష్టం

చిన్న వయస్సులోనే వ్యాపార పరంగా గణనీయ విజయాలు సాధించిన సైరస్‌ మిస్త్రీ, వ్యక్తిగతంగా ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. అందరితో మృదువుగా మాట్లాడే ఆయన, పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చేవారని సన్నిహితులు చెబుతారు. చదవడం ఆయనకు ఎంతో ఇష్టమైన వ్యాపకం కాగా గోల్ఫ్‌ ఆడటంలో సేదతీరేవారు.

* 1968 జులై 4న ముంబయిలో పల్లోంజీ మిస్త్రీ, పాట్సీ పెరిన్‌ దుబాష్‌ దంపతులకు ఆయన జన్మించారు. తల్లి ఐర్లండ్‌కు చెందినవారు కాగా, సైరస్‌ కూడా ఐరస్‌ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. అయితే స్థిర నివాసం భారత్‌లోనే.

* లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాల నుంచి సివిల్‌ ఇంజినీరింగ్, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఎంఎస్‌సీ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ను సైరస్‌ అభ్యసించారు.

* ఆయనకు సోదరుడు షాపూర్‌ మిస్త్రీ (ప్రస్తుతం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ఛైర్మన్‌), సోదరీమణులు లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు. రతన్‌ టాటా సోదరుడు నోయల్‌ టాటా సతీమణే ఆలూ మిస్త్రీ.

* ప్రసిద్ధ న్యాయవాది ఇక్బాల్‌ చాగ్లా కుమార్తె అయిన రోహికా చాగ్లాను సైరస్‌ 1992లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఫిరోజ్‌ మిస్త్రీ, జహాన్‌ మిస్త్రీ ఉన్నారు.

* 1991లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌లో చేరిన సైరస్, 20 ఏళ్ల వ్యవధిలో సంస్థ టర్నోవర్‌ను 20 మిలియన్‌ డాలర్ల నుంచి 1.5 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లారు. దేశంలో తొలి అత్యంత ఎత్తైన నివాస సముదాయాలు, అత్యంత పొడవైన రైలు బ్రిడ్జి, అతిపెద్ద అందుబాటు ధర నివాస సముదాయాల వంటివి సైరస్‌ నాయకత్వంలోనే ఎస్‌పీ గ్రూప్‌ చేపట్టింది.

* టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించినప్పుడూ లాభదాయకత, స్థిరత్వంపై దృష్టి సారించారు. ఆదాయాన్ని సమకూర్చని ఆస్తులనువదిలించేందుకు ప్రాధాన్యమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని