Layoffs: పీసీలకు తగ్గిన గిరాకీ.. డెల్‌లో 6600 ఉద్యోగాల కోత

కరోనా సంక్షోభం తర్వాత పీసీలకు గిరాకీ భారీగా తగ్గింది. దీంతో కంపెనీల ఆదాయాలు పడిపోతున్నాయి. ఫలితంగా పీసీ తయారీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Published : 06 Feb 2023 14:39 IST

ఆస్టిన్‌ (టెక్సాస్‌): కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులంతా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ చేశారు. అలాగే విద్యార్థులు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో పాఠాలు విన్నారు. దీంతో పర్సనల్‌ కంప్యూటర్ల (PC)కు గిరాకీ భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగానే పీసీ తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ, కరోనా సంక్షోభం ముగియడంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి.

ఇప్పుడు అన్ని టెక్‌ కంపెనీల తరహాలోనే పీసీ తయారీ కంపెనీలు సైతం వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. అందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా డెల్‌ టెక్నాలజీస్‌ 6,650 మందికి ఉద్వాసన పలికేందుకు (Layoffs in Dell) సిద్ధమైంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఐదు శాతానికి సమానం. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ‘కో-చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌’ జెఫ్‌ క్లార్క్‌ వెల్లడించారు.

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పీసీల విక్రయాలు గణనీయంగా పడిపోయినట్లు ప్రముఖ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐడీసీ తెలిపింది. డెల్‌ (Dell) విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 37 శాతం పడిపోయినట్లు వెల్లడించింది. కంపెనీ (Dell) ఆదాయంలో 55 శాతం పీసీల నుంచే వస్తోంది. డెల్‌ (Dell) కంటే ముందు ఇతర పీసీ తయారీ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల్ని తగ్గించుకున్నాయి. హెచ్‌పీ గత నవంబరులో 6,000 మందిని తొలగించింది. సిస్కో సిస్టమ్స్‌ 4,000 మందికి ఉద్వాసన పలికింది. 2022లో ఇప్పటి వరకు టెక్‌ రంగంలో 97,171 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ ఛాలెంజర్‌ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఉద్యోగ కోతలు 649 శాతం పెరిగినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని