Bank Deposits: డబ్బులు దాచుకున్న బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారుడి పరిస్థితి ఏంటి?

డబ్బులు దాచుకున్న బ్యాంకు దివాళా తీస్తే.. ఆ వినియోగదారుల పరిస్థితి ఏంటి? పూర్తిగా నష్టపోవడమేనా? ఇదిగో సమాధానం.

Updated : 14 Mar 2023 18:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులో డబ్బులు దాచుకుంటే భద్రం. అయితే ఆ బ్యాంకులు దివాలా (Banks Insolvency) తీస్తే.. ఆ డబ్బులు పరిస్థితి ఏంటి? ఇటీవల అమెరికాకు చెందిన ఎస్‌వీబీ బ్యాంకు (SVB Bank) దివాళా తీశాక ఈ ప్రశ్న చాలామందికి వచ్చింది. మన దేశంలో ఏదైనా బ్యాంకుకు ఇదే పరిస్థితి వస్తే ఖాతాదారుల  డబ్బుల సంగతి ఏంటి అనే డౌట్‌ మీకూ వచ్చి ఉంటే.. ఈ వార్తలో మీకు సమాధానం దొరుకుతుంది.

వినియోగదారుడు బ్యాంకులో దాచుకున్న డబ్బులపై బీమా రక్షణ ఉంటుంది. ఈ సదుపాయం ఖాతాదారులకు ఉచితమే. దీనికి సంబంధించిన ప్రీమియంను బ్యాంకులే చెల్లిస్తాయి. అనుకోని పరిస్థితుల్లో బ్యాంకు మూసేస్తే, లేక ఇంకేదైనా జరిగితే ఆ పరిహారం ఖాతాదారులకు అందుతుంది. అయితే ఆ పరిహారం గరిష్ఠంగా రూ.5 లక్షలు మాత్రమే. అంటే మీరు బ్యాంకులో ఎంత దాచుకున్నా.. మీకు రూ. 5 లక్షలే (అసలు, వడ్డీ కలిపి) వస్తాయి. ఒకే బ్యాంకులోని వివిధ శాఖల్లో ఖాతాలు ఉన్నా.. వాటన్నింటికి కలిపి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే బీమా ఇస్తారు. ఒకే బ్యాంకులో ఎక్కువ ఖాతాలుంటే వాటన్నింటినీ ఒకే ఖాతాగా పరిగణిస్తారు.

DICGC ఆధ్వర్యంలో...

ఈ మొత్తం బీమా ప్రాసెస్‌ను డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) చూసుకుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన DICGC... కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. దేశంలోని అన్ని వాణిజ్య, విదేశీ బ్యాంకుల్లో ఉంచిన డిపాజిటర్ల డబ్బుకు DICGCనే బీమా రక్షణ కల్పిస్తుంది. కేంద్ర, రాష్ట్ర, పట్టణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు DICGC బీమా కవర్‌ తీసుకోవాలి. బ్యాంకుల్లోని పొదుపు, ఫిక్స్‌డ్‌, కరెంట్‌, రికరింగ్‌ డిపాజిట్‌ వంటి అన్ని డిపాజిట్లపైనా బీమా వర్తిస్తుంది.

బీమా పరిమితి రూ.5 లక్షలు మాత్రమే కాబట్టి అంతకుమించి బ్యాంకుల్లో మదుపు చేయడం రిస్క్ అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అయితే, మీరు రూ.10 లక్షలు మదుపు చేయాలనుకుంటే, అందులో రూ.5 లక్షలు మీ వ్యక్తిగత ఖాతా ద్వారా, మిగిలిన మొత్తాన్ని మీ భార్య/పిల్లల పేరు మీద చేయొచ్చు. అలాగే ఈ బీమా సౌకర్యం జాయింట్ ఖాతాకు కూడా వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని