Diesel price: లీటర్‌ డీజిల్‌పై ₹25 పెంపు.. బల్క్‌ యూజర్లకు మాత్రమే!

అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ‘పెద్ద వినియోగదారుల’కు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.25 పెరిగింది....

Updated : 20 Mar 2022 17:15 IST

దిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ‘పెద్ద వినియోగదారుల’ (bulk users)కు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్ పంపుల వద్ద కొనే సామాన్య పౌరులకు మాత్రం ఈ రేట్లు వర్తించవని ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. 

సాధారణంగా బల్క్‌ యూజర్లకు వర్తించే ధరలు రిటైల్‌ ధరలతో పోలిస్తే ఎక్కువుంటాయి. ఈ అధిక ధర నుంచి తప్పించుకోవడానికి వారంతా పెట్రోల్‌ పంపుల వైపు మళ్లారు. మరోవైపు త్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సామాన్యులు సైతం కొనుగోళ్లను పెంచారు. ఫలితంగా ఈ నెల పెట్రోల్‌ పంపుల వద్ద విక్రయాలు దాదాపు ఐదోవంతు పెరిగాయి. ఇది రిటైల్‌ విక్రయ సంస్థల నష్టాల పెరుగుదలకు దారితీసింది.

ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్‌ వంటి ప్రైవేటు రిటైల్‌ విక్రయ సంస్థలు భారీ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గత 136 రోజులుగా ధరలు స్థిరంగా ఉండడంతో.. రాయితీ ధరకు చమురును పొందే ప్రభుత్వరంగ సంస్థలతో ఇవి పోటీపడలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంపులను మూసివేయడం తప్ప మరోమార్గం ఉండదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2008లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశవ్యాప్తంగా ఉన్న 1,432 పెట్రోల్‌ పంపులను మూసివేసిందని గుర్తుచేశాయి. ఇప్పుడూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే పెద్ద వినియోగదారులు పెట్రోల్‌ పంపుల వద్దకు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా వీరికి మాత్రమే ప్రభుత్వ రిటైల్‌ సంస్థలు ధరలను పెంచాయి. దీంతో ముంబయిలో బల్క్‌ యూజర్లకు లీటరు డీజిల్‌ ధర రూ.122.05కు చేరింది. అదే సామాన్యులకు మాత్రం ఈ ధర రూ.94.14గా కొనసాగుతోంది. దిల్లీలో ఈ రేట్లు వరుసగా రూ.115, రూ.86.67గా ఉన్నాయి.

నవంబరు 4, 2021 తర్వాత ప్రభుత్వ రంగ రిటైల్‌ విక్రయ సంస్థలు ధరల్ని పెంచలేదు. మరోవైపు ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ధరల్ని పెంచుతారని భావించినప్పటికీ.. అలా జరగలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రైవేటు రిటైలర్లూ ధరల్ని పెంచలేదు. దీంతో నష్టాలు పెరిగిపోతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు