Debt Funds: డివిడెండ్ vs ఎస్డబ్లూపీ - ఏది ఎంచుకుంటే మంచిది?
క్రమానుగత ఆదాయం కోరుకునేవారు క్రమానుగత ఉపసంహరణ విధానాన్ని ఎంచుకోవచ్చు.
డెట్ ఫండ్లలో మదుపు చేసేవారు ఆర్థిక సలహాదారులను సాధారణంగా అడిగే ప్రశ్న, డివెడెండ్ ఆప్షన్ ఎంచుకోవాలా లేదా విత్డ్రా ఆప్షన్ ఎంచుకోవాలా అని. దీనికి సలహాదారులు ఎక్కువగా ఇచ్చే సమాదానం ఎస్డబ్ల్యూపీ. ఎందుకంటే డివిడెండ్పై ఎక్కువ పన్ను పడుతుంది. దీంతో రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది పన్ను చెల్లించనవసరం లేదనే అపోహతో డివెడెండ్ ఆప్షన్ ఎంచుకొని నష్టపోతుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే కంపెనీలు డివెడెండ్ ఇచ్చేముందు డివెడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) మినహాయించుకుంటాయి.
డివెడెండ్ కంటే ఎస్డబ్ల్యూపీ ఎందుకు మేలో ఇప్పుడు తెలుసుకుందాం..
పన్ను ప్రయోజనాలు:
మీరు మీ డెట్ మ్యూచువల్ ఫండ్ నుంచి డివిడెండ్లను సేకరించినప్పుడు, ఫండ్ హౌస్ మీ తరపున సెస్, సర్చార్జ్తో సహా 29.12 శాతం డిడిటిని చెల్లిస్తుంది. మీరు పొందే డివిడెండ్ మొత్తం నుంచి ఇది తగ్గిస్తారు. ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరణపై మీరు చెల్లించే పన్ను చాలా తక్కువ. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఉపసంహరించుకునేదానిలో మొత్తం పెట్టుబడులతో పాటు, లాభాలు కూడా కలిపి ఉంటాయి. కానీ పన్ను కేవలం లాభాలపై మాత్రమే పడుతుంది. చాలా సందర్భాల్లో పన్ను చెల్లించిన తర్వాత కూడా మంచి రాబడిని పొందవచ్చు.
ఒకవేళ మీరు పెట్టుబడులు పెట్టిన మూడేళ్ళలోపు డెట్ ఫండ్ నుంచి డబ్బు తీసుకుంటే, లాభాలు మీ ఆదాయానికి జోడించి మీకు వర్తించే స్లాబు రేట్ల ఆధారంగా పన్ను విధిస్తారు. మూడు సంవత్సరాల పెట్టుబడి తర్వాత మీరు ఉపసంహరించుకుంటే, ఇండెక్సేషన్తో 20 శాతం పన్ను వర్తిస్తుంది. 36 నెలల తర్వాత ఉపసంహరణలు జరిగితే ఇండెక్సేషన్ కారణంగా పన్నులు గణనీయంగా తగ్గుతుందని గుర్తుంచుకోండి.
మీరు పన్ను పరిధిలో ఉంటే, మీకు ఎటువంటి గణనీయమైన లాభాలు లేకపోతే, ఎస్డబ్ల్యూపీ విషయంలో స్వల్పకాలిక మూలధన లాభాలపై ఎటువంటి పన్ను చెల్లించే అవసరం ఉండదు. అలాగే, మీరు నష్టపోతే, దానికి వ్యతిరేకంగా మీ లాభాలను సర్దుబాటు చేయడం ద్వారా మీరు పన్నులను ఆదా చేయవచ్చు. పన్ను నిబంధనలు పన్ను చెల్లింపుదారులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలను (స్వల్పకాలిక మూలధన నష్టం తో) తగ్గించడానికి అనుమతిస్తాయి. దీర్ఘకాలిక మూలధన నష్టాన్ని దీర్ఘకాలిక లాభాలకు మాత్రమే సెట్ చేయవచ్చు, ఎనిమిది సంవత్సరాల వరకు ఈ విధంగా సర్దుబాటు చేయవచ్చు.
ఇతర ప్రయోజనాలు:
ముఖ్యంగా జీవిత కాలం కష్టపడి మదుపు చేసిన డబ్బు నుంచి పదవీ విరమణ జీవితానికి క్రమంగా ఆదాయం ఉండాలని కోరుకునేవారు.. ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఇతరులు కూడా క్రమంగా కొంత ఆదాయం అవసరమైతే.. ఈ విత్డ్రా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో డివిడెండ్ కంటే విత్డ్రా ఆప్షన్ మేలు చేస్తుంది. ఎస్డబ్ల్యూపీలో కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. మదుపరులు తమ అవసరాన్ని బట్టి విత్డ్రా ఆప్షన్ను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ డివిడెండ్ను ఈ విధంగా ఫిక్స్ చేయలేము.
ఉపసంహరణ:
విత్డ్రా ఆప్షన్లో ఉపసంహరణలు ఫండ్ పనితీరుపై ఆధారపడవు. మరోవైపు మ్యూచువల్ ఫండ్ డివెడెండ్ను లాభం వచ్చినప్పుడు మాత్రమే మదుపరులకు అందిస్తాయి. అందుకే అవసరమైనప్పుడు ఆదాయం పొందే అవకాశం ఉండదు. రెగ్యులర్గా డివెడెండ్ పంపిణీ చేసే ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ సంస్థలు కూడా కచ్చితంగా డివెడెండ్ను ఇస్తాయని చెప్పలేం. ఫండ్ పనితీరు బాగా లేకపోతే, లాభాలు రాకపోతే డివెడెండ్ రాదు. డివెడెండ్ వచ్చినప్పటికీ అది ఎంత అనేది ఫండ్ లాభాలపై ఆధారపడి ఉంటుంది. డివెడెండ్ ఇచ్చిన తర్వాత ఫండ్ నికర ఆస్తి విలువ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోండి.
ఎగ్జిట్ లోడ్:
విత్డ్రా ఆప్షన్లో ఉన్న ఏకైక ప్రతికూలత ఎగ్జిట్ లోడ్ అని చెప్పవచ్చు. అది డెట్ ఫండ్ రకం, పెట్టుబడుల హోల్డింగ్ పిరియడ్లపై ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ఠ కాలం తర్వాత ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండదు. స్వల్ప కాలిక ఫండ్లు..లిక్విడ్ ఫండ్లు లేదా అల్ర్టా షార్ట్ ఫండ్ల విషయంలో కొన్ని నెలల తర్వాత ఉపసంహరించుకుంటే ఫండ్ సంస్థలు సాధారణంగా ఎగ్జిట్ లోడ్ విధించవు. పెట్టుబడుల సమయంలో ఎగ్జిట్ లోడ్ లేని ట్రాక్ రికార్డు ఉన్న స్కీమ్ను కూడా ఎంచుకోవచ్చు.
చివరగా:
డెట్ ఫండ్ల నుంచి క్రమంగా విత్డ్రా చేసుకుంటే పెట్టుబడుదారులకు పన్ను చెల్లింపుల తర్వాత ఎక్కువ రాబడి పొందడమే కాకుండా అవసరానికి నగదు పొందొచ్చు. కానీ డివెడెండ్ ఆప్షన్ ఎంచుకుంటే ఎంత డివెడెండ్ వస్తుందో ముందుగానే ఊహించలేము. అంతేకాకుండా డివెడెండ్పై పన్ను కూడా ఎక్కువే పడుతుంది. ఒకవేళ ఇప్పటికే డివెడెండ్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఇప్పటికైనా ఎస్డబ్ల్యూపీ ఆప్షన్కు మారడం మంచిది. పెద్ద మొత్తం లో పెట్టుబడి ఉన్నప్పుడే డెట్ ఫండ్స్ ఎంచుకోవడం మంచిది. 1-3 ఏళ్ళ కాలపరిమితి కోసం ఎంచుకోవచ్చు. ప్రతి మ్యూచువల్ ఫండ్ లాగే ఇందులో కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి అవగాహన తెచుకున్నాకే పెట్టుబడి పెట్టడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.