DLF: 1,137 ఫ్లాట్లు.. మూడు రోజులు.. రూ.8,000 కోట్లు!

ది ఆర్బర్‌ పేరిట గురుగ్రామ్‌లో DLF హౌసింగ్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. దీంట్లో ఫ్లాటన్నీ మూడు రోజుల్లోనే అమ్ముడైనట్లు పేర్కొంది. రూ.8,000 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపింది.

Published : 16 Mar 2023 14:12 IST

దిల్లీ: గురుగ్రామ్‌లోని తమ హౌసింగ్‌ ప్రాజెక్టులో 1,137 విలాసవంతమైన ఫ్లాట్లను విక్రయించినట్లు ప్రముఖ స్థిరాస్తి సంస్థ DLF లిమిటెడ్‌ గురువారం ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.ఏడు కోట్ల పైనే ఉంటుందని పేర్కొంది. ఆ లెక్కన రూ.8,000 కోట్ల ఆదాయం లభించినట్లు వెల్లడించింది. కేవలం మూడు రోజుల్లోనే విక్రయాలు పూర్తయినట్లు తెలిపింది. ప్రధాన నగరాల్లో ప్రీమియం ఫ్లాట్లకు ఉన్న గిరాకీకి ఇది నిదర్శనమని పేర్కొంది.

‘‘గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 63, గోల్ఫ్‌ కోర్స్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌ ప్రాంతంలో ‘ది ఆర్బర్‌’ పేరుతో ఈ హౌసింగ్‌ ప్రాజెక్టును 25 ఎకరాల్లో అభివృద్ధి చేశాం. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం ఐదు టవర్లు  ఉంటాయి. ఒక్కో దాంట్లో 38 - 39 అంతస్తులుంటాయి. ఒక్కో ఫ్లాట్‌లో 4 బెడ్‌ రూమ్‌లు ఉండనున్నాయి’’ అని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అయితే విక్రయాలను అధికారికంగా ప్రారంభించడానికి ముందు నిర్వహించిన ‘ప్రీ-ఫార్మల్‌ లాంఛ్‌’లోనే ఈ ఫ్లాట్లన్నీ అమ్ముడైనట్లు తెలిపింది.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా భారత్‌లో డీఎల్ఎఫ్‌ అతిపెద్ద స్థిరాస్తి సంస్థ. ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్య కంపెనీ సేల్స్‌ బుకింగ్‌లు 45 శాతం వృద్ధితో రూ.6,599 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆ విలువ రూ.4,544 కోట్లుగా ఉంది. ఈ ఏడాది దిల్లీ, గురుగ్రామ్‌, పంచకుల, చెన్నైలో రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు ప్రారంభించింది. ఈ కంపెనీ ఇప్పటి వరకు 330 మిలియన్‌ చదరపు అడుగుల్లో 153 ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది. రూ.7,500 కోట్ల ఆదాయ అంచనాలతో త్వరలోనే ది ఆర్బర్‌ ప్రాజెక్టు విక్రయాలు ప్రారంభిస్తామని జనవరిలోనే కంపెనీ ప్రకటించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని