Savings Account: రెండు కంటే ఎక్కువ పొదుపు ఖాతాలున్నాయా?
ఆర్థికంగా క్రమశిక్షణ గల వారైతే రెండు ఖాతాలను వాడుకంలో ఉంచితే సరిపోతుంది
మీకు ఎన్ని పొదుపు ఖాతాలున్నాయి?సాధారణంగా, తరుచూ ఉద్యోగం మారేవారికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా, సంపాదన ప్రారంభమవ్వడానికి ముందు తల్లిదండ్రుల సహాకారంతో తెరిచిన పొదుపు ఖాతా, ప్రభుత్వ సబ్సిడీలు పొందేందుకు, ఖర్చులకు మరొక ఖాతా ఇలా రకరకాల కారణాలతో ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలను నిర్వహించే వారు మనలో చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఖాతాలన్నింటిని ఇప్పటికీ నిర్వహిస్తున్నారా?
రెండు లేదా మూడు ఖాతాలు చాలు..
బ్యాంకు ఖాతాను తెరిచే ముందు, ఆ ఖాతను ఎందుకు తెరుస్తున్నాము అన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఉండాలి. మీరు తీసుకున్న ప్రతీ బ్యాంకు ఖాతాకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉండాలి. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించిన అన్ని అవసరాలకు మూడు పొదుపు ఖాతాలు సరిపోతాయి. ఉదాహరణకు, మీ శాలరీ ఖాతా మీకు వచ్చే ఆదాయాన్ని చూపిస్తుంది. నిత్యావసర వస్తువులు, అద్దె, బిల్లులు చెల్లించేందుకు ఒక ఖాతా నిర్వహించవచ్చు. నెలవారీ పద్ధతిలో పొదుపు, పెట్టుబడులు చేసేందుకు మూడో ఖాతాను ఉపయోగించుకోవచ్చు. మీరు ఆర్థికంగా క్రమశిక్షణ గల వారైతే రెండు ఖాతాలను వాడుకంలో ఉంచితే సరిపోతుంది. మీ ఆదాయం, పెట్టుబడులకు ఒక ఖాతా, మీ వ్యయాలకు వేరొక ఖాతాను ఉపయోగించుకోవచ్చు.
పొదుపును కోల్పోవలసి రావచ్చు..
పొదుపు ఖాతాలో అన్ని బ్యాంకులు అన్ని రకాల సేవలను ఉచితంగా అందించవు. ఈ ఖాతాకు అందించే సేవలకు బ్యాంకులు రుసుము విధిస్తాయి. సాధారణంగా, పొదుపు ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించాలి. ఈ కనీస బ్యాలెన్స్ నిర్వహించడంలో విఫలం అయితే అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది.
రాబడి నష్టం..
ఎక్కువ ఖాతాలు ఉన్నట్లయితే ప్రతి ఖాతాలోనూ సగటు బ్యాలెన్స్ ఉంచాలి. కాబట్టి, ఎక్కువ మొత్తం ఖాతాలో లాక్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకు మీకు అయిదు పొదుపు ఖాతాలున్నాయనుకుందాం. ఒక్కో ఖాతాలో రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు కనీస నిల్వ ఉంచాల్సి వస్తే, మీరు పొదుపు ఖాతాల్లో నిర్వహించే కనీస నిల్వ రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది. ఖాతాల్లో ఉన్న ఈ మొత్తంపై వార్షికంగా 3 నుంచి 4 శాతం వడ్డీ వస్తుంది. ఈ ఖాతాలనూ రద్దు చేసుకొని, ఆ మొత్తాన్ని రాబడి ఇచ్చే దీర్ఘ కాల పథకాల్లో పెట్టుబడి పెడితే కనీసం 8 నుంచి 9 శాతం వడ్డీ ఆర్జించవచ్చు.
జాయింట్ ఖాతా..
తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో జాయింట్ ఖాతాను నిర్వహించడం మంచిదేనా? ఈ ప్రశ్నకు సమాధానం మీకు మీ కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం, ప్రతీ ఒక్క ఖాతాదారుని ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఖాతాదారుల మధ్య అవగాహన, నమ్మకం ఉండి వారి లక్ష్యాలు ఒక్కటే అయితే వారిని సహా ఖాతాదారునిగా ఉంచి ఖాతా తెరవచ్చు. పిల్లల విద్య, పదవీవిరమణ నిధి వంటి లక్ష్యాల కోసం జాయింట్ ఖాతాను తీసుకోవచ్చు. ఒకవేళ ఇరువురి ఆర్థిక ప్రవర్తన వేరుగా ఉంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరువురు వేరువేరు ఖాతాలను తీసుకోవడం మంచిది.
మర్చిపోతే నష్టమే..
కొంత మంది 10 నుంచి 15 సంవత్సరాల క్రితం తెరిచిన పొదుపు ఖాతాను మర్చిపోతుంటారు. మీరు తెరిచిన ఖాతాలో డబ్బును ఉంచి, మర్చిపోతే, మీరు ఆ మొత్తాన్ని కోల్పోయినట్లే. ఎందుకంటే డెబిట్ కార్డు, ఇతర సేవా రుసుములను మీ ఖాతాలో ఉన్న మొత్తం నుంచి తీసుకుంటారు. మీరు చూసే సమయానికి బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండకపోగా మీరే చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి నిరుపయోగమైన ఖాతాల వల్ల మీతో పాటు నామినీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఎలా మూసివేయచ్చు?
చాలా వారకు బ్యాంకులు ఈ మధ్య ఆన్లైన్ లోనే ఖాతాలు తెరిచే సౌకర్యం కలిపిస్తున్నాయి. అయితే, ఆన్లైన్ లో ఖాతా మూసే వీలు మాత్రం ఉండదు. మీరు నేరుగా మీ బ్యాంకు కి వెళ్లి అక్కడ సంబంధిత ఫోరమ్ నింపి, ఖాతా లో ఉన్న బ్యాలన్స్ ని మీ ఇతర ఖాతాకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరవాత కొద్ది రోజులకి ఖాతా మూసి వేయబడుతుంది.
చివరిగా:
మీ అవసరాలకు అనుగుణంగా, ఖాతాలను తీసుకోవడంలో తప్పు లేదు. అయితే, వీలైనంత వరకూ వేతన ఖాతాకు తోడుగా మరో ఖాతాను తీసుకోవడం మంచిది. తప్పదు అనుకుంటేనే మూడో ఖాతా తీసుకోవాలి. మీకు జాయింట్ ఖాతా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఒక ఖాతా ఉండడం మంచిది. ఖాతాలకు ఆధార్ నెంబరు, పాన్ అనుసంధానించండి. వేతన ఖాతాలో మీ వేతనానికి సంబంధించిన లావాదేవీలనే నిర్వహించండి. ఒక సంస్థ నుంచి వేరొక సంస్థకు మారినప్పుడు, కొత్త సంస్థ శాలరీ ఖాతా తెరిస్తే, మీ పాత సంస్థ వారు ఇచ్చిన శాలరీ ఖాతా రద్దు చేయడం మర్చిపోకండి. వాడకంలో లేని ఖాతాలను వీలైనంత వెంటనే రద్దు చేసుకోండి. మీకు ఉన్న అన్ని ఖాతాలలోనూ కనీస నిల్వ ఉండాలి. లేదంటే, అపరాధ రుసుములు విధిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని గుర్తుంచుకోవండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి