E20 fuel: అప్పటికల్లా దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ పంపులు: హర్దీప్‌ సింగ్‌

E20 fuel pumps:  దేశవ్యాప్తంగా 2025 నాటికి E20 పెట్రోల్‌ పంపులు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ వెల్లడించారు.

Published : 07 Jul 2023 17:46 IST

ముంబయి: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే పెట్రోల్‌ (E20 fuel) పంపుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి (Hardeep Singh Puri) తెలిపారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా ఈ పంపులను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే పెట్రోల్‌ను E20 పెట్రోల్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తొలి E20 పెట్రోల్‌ పంపు ప్రారంభమవ్వగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 600కు పెరిగింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఇక్కడి జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు.

2013-14 సంవత్సరంలో ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం కేవలం 1.53 శాతం మాత్రమే కాగా.. 2023 మార్చి నాటికి 11.5 శాతానికి పెరిగిందని హర్దీప్‌ సింగ్‌ తెలిపారు. వాల్యూమ్‌ పరంగా చూస్తే 2013-14 నాటికి ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం 38 కోట్ల లీటర్లు ఉండగా.. 2021-22 నాటికి 433.6 కోట్ల లీటర్లకు పెరిగిందని చెప్పారు. బయో ఫ్యూయల్స్‌ విక్రయించే పెట్రోల్‌ పంపుల సంఖ్య సైతం 2016-17లో 29,890 పంపుల ఉండగా.. మూడు రెట్లు పెరిగి ఆ సంఖ్య 67,640కు చేరినట్లు వెల్లడించారు.

20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను విక్రయించేందుకు ఉద్దేశించిన వాస్తవ లక్ష్యం 2030 కాగా.. దాన్ని 2025కి ప్రభుత్వం కుదించినట్లు హర్దీప్‌సింగ్‌ పురీ గుర్తుచేశారు. ఈ ప్రయాణంలో 11.5 శాతం మైలురాయిని అందుకున్నట్లు తెలిపారు. 10 శాతం ఇథనాల్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న గడువు కంటే ముందుగానే 2022 జూన్‌ నాటికే అందుకున్నట్లు గుర్తు చేశారు. అలాగే, 2006-07లో చమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 27గా ఉండగా.. 2023 నాటికి ఆయా దేశాల సంఖ్య 39కి పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్నామని తెలిపారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు