Ukraine Crisis: యుద్ధం... ప్రపంచార్థికానికి శాపం!

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. 1970లలో ఐరోపా దేశాల సరిహద్దులను సర్వామోదనీయంగా నిర్దేశిస్తూ ఒప్పందాలు కుదిరాయి. ఆపైన బెర్లిన్‌ గోడ పతనం, సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడం తదితరాల తరవాత సరిహద్దుల్లో మళ్ళీ మార్పులు వచ్చాయి.

Published : 01 Mar 2022 09:27 IST

కొవిడ్‌ నుంచి కోలుకొనేలోపే మరోదెబ్బ

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. 1970లలో ఐరోపా దేశాల సరిహద్దులను సర్వామోదనీయంగా నిర్దేశిస్తూ ఒప్పందాలు కుదిరాయి. ఆపైన బెర్లిన్‌ గోడ పతనం, సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడం తదితరాల తరవాత సరిహద్దుల్లో మళ్ళీ మార్పులు వచ్చాయి. ఇటీవలి వరకు అవి పేచీ లేకుండానే కొనసాగాయి. వాటిని ఆమోదించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుత సరిహద్దులు ప్రచ్ఛన్న యుద్ధానంతరం రుద్దినవని భావిస్తూ, వాటిని అంగీకరించబోమంటున్నారు. తమ సరిహద్దుల్లో తామే సార్వభౌములమని ఉక్రెయిన్లు తేల్చిచెబుతున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెత్స్క్‌, లుహాన్స్క్‌లను 2014లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అదుపులోకి తీసుకోవడం ప్రస్తుత సంక్షోభానికి బీజం వేసింది. బొగ్గు క్షేత్రాలతో సుసంపన్నమైన ఆ రెండు ప్రాంతాలను 18వ శతాబ్దిలో జార్‌ చక్రవర్తుల ఏలుబడిలోని రష్యా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినా అమెరికా, నాటో కూటమి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేకపోతున్నాయి. అమెరికా తన మిత్రులను ఏ మేరకు ఆదుకోగలదో తాజా సంక్షోభం బయటపెడుతోంది. మరోవైపు, మాస్కోపై ముసురుకొంటున్న ఆంక్షలు ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనున్నాయి.    
 

గోధుమల నుంచి చమురు వరకు 

కొవిడ్‌ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు ఉద్దీపన కార్యక్రమాలకు భారీగా ధన వ్యయం చేశాయి. అదిప్పుడు ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. కొవిడ్‌ కాలంలో విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు నేటికీ పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇంతలోనే ఉక్రెయిన్‌ సంక్షోభం వచ్చిపడింది. యుద్ధం ఎంత కాలం సాగితే ప్రపంచానికి అంతగా ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా యుద్ధాన్ని ప్రారంభించి, అంతే వడిగా తాను అనుకున్నది సాధించి, సమరాన్ని ముగించేయాలని పుతిన్‌ ఆశించి ఉండవచ్చు. కానీ, కదనాన్ని మొదలుపెట్టడమే తన చేతుల్లో ఉంటుంది తప్ప అది ఎప్పటికి ముగుస్తుందనేది అనూహ్యమని ఆయనకు త్వరలోనే అవగతం కావచ్చు. చరిత్రలో ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. యుద్ధం దీర్ఘకాలం సాగితే రష్యాతోపాటు ఐరోపా దేశాలూ ఆర్థికంగా నష్టపోతాయి. రష్యా, ఉక్రెయిన్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారులు. ప్రపంచవ్యాప్త అతిపెద్ద చమురు, సహజవాయు ఉత్పత్తిదారుల్లో రష్యా ముఖ్యమైనది. ఐరోపా చమురు, గ్యాస్‌ అవసరాల్లో సగభాగం రష్యా ద్వారానే తీరుతున్నాయి. జర్మనీకి గ్యాస్‌ సరఫరాలను పెంచడానికి ఉద్దేశించిన నార్డ్‌స్ట్రీమ్‌-2 పైపులైను నిర్మాణం పూర్తయినా తాజా సంక్షోభం వల్ల అది మూలన పడిపోయింది. రష్యా నుంచి పలు ఐరోపా దేశాలకు గ్యాస్‌ తీసుకెళ్ళే పైపులైన్లు ఉక్రెయిన్‌ భూభాగం మీదుగానే నిర్మితమయ్యాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ గోధమ ధరలు ఇప్పటికే పది శాతం పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్‌ గోధుమ ఎగుమతుల్లో ఇరవై శాతం ఇంకా నౌకలకు ఎక్కలేదు. ఐరోపా గోధుమ, బార్లీ, మొక్కజొన్న అవసరాలు ప్రధానంగా ఉక్రెయిన్‌ ద్వారానే తీరుతున్నాయి. ఇంకా ఇండొనేసియా(30 లక్షల టన్నులు), ఈజిప్ట్‌(24 లక్షల టన్నులు), టర్కీ(15 లక్షల టన్నులు), పాకిస్థాన్‌(11 లక్షల టన్నులు) వంటివి ఉక్రెయిన్‌ గోధుమలను పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా మీద అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన ఆంక్షలు దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతాయి. అమెరికాతో పాటు ఇతర కీలక దేశాలు అంతర్జాతీయ బ్యాంకు చెల్లింపుల మధ్యవర్తి వేదిక అయిన స్విఫ్ట్‌ నుంచి రష్యాను వెలివేశాయి. రెండొందల దేశాలకు చెందిన 11 వేల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్విఫ్ట్‌లో సభ్యులుగా ఉన్నాయి. 2020లో దాని ద్వారా వాటి మధ్య 950 కోట్ల సందేశాలు ప్రసారమై, ఒక దేశం నుంచి మరో దేశానికి సులువుగా డబ్బు బదిలీ కావడానికి తోడ్పడ్డాయి. ఈ సందేశాల్లో సగం ఐరోపా, ఆఫ్రికాల్లోనే ప్రసారమయ్యాయి. గోధుమ నుంచి చమురు, గ్యాస్‌ వరకు అన్ని వ్యాపార సరకులకు చెల్లింపులు స్విఫ్ట్‌ ద్వారా జరుగుతాయి. అటువంటి వేదిక నుంచి రష్యాను దూరంపెట్టడంతో ఆ దేశ కరెన్సీ ‘రూబుల్‌’పై ప్రభావం పడుతోంది. దాని విలువ క్షీణిస్తున్నట్లు కథనాలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు, ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రష్యా కొన్నేళ్లుగా చర్యలు తీసుకొంటూ వచ్చింది. కొవిడ్‌ తరవాత చమురు ఉత్పత్తిని తగ్గించడమా, పెంచడమా అన్నదానిపై సౌదీ అరేబియా నాయకత్వంలోని ‘ఒపెక్‌’ (చమురు ఎగమతి చేసే దేశాల కూటమి) నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంది. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి ముందు చైనాకు దీర్ఘకాలిక ప్రాతిపదికపై భారీగా ఆయిల్‌, గ్యాస్‌ సరఫరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అది క్రెమ్లిన్‌తో పాటు బీజింగ్‌కూ లాభదాయకమే.  

ద్రవ్యోల్బణానికి రెక్కలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల చమురు, సహజ వాయు సరఫరాలకు విఘాతం ఏర్పడి రానున్న మూడు నెలల్లో ప్రపంచ ద్రవ్యోల్బణం ఒక శాతం మేర పెరుగుతుందని అంచనా. రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా పది శాతం తగ్గితే యూరో ప్రాంత జీడీపీ 0.7 శాతం దాకా కోసుకుపోతుందని ఐరోపా కేంద్ర బ్యాంకు లెక్కగట్టింది. రష్యాను స్విఫ్ట్‌ నుంచి బహిష్కరించిన దృష్ట్యా ప్రపంచానికీ ఆర్థికంగా పెనునష్టమే సంభవించవచ్చు. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి ముందు రష్యాకు వివిధ దేశాల బ్యాంకుల్లో 30 వేల కోట్ల డాలర్ల నిధులు ఉన్నాయి. వాటిలో 16 శాతమే ఆ దేశ ప్రభుత్వానికి చెందినవి. ఐరోపా దేశాలు రష్యాకు ఏడు వేల కోట్ల డాలర్లకు పైగా రుణాలు ఇచ్చి ఉన్నాయి. రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాల్సి రావడం వల్ల తలెత్తే దుష్ప్రభావం మొదట ఈయూపైనే పడుతుంది. చమురు ధరలు పెరగడం భారత్‌, టర్కీ వంటి వర్ధమాన దేశాలకూ నష్టదాయకం. చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు ఇండియా వేగంగా స్వస్తి చెబుతూ పునరుత్పాదక ఇంధనాలకు మారడం అత్యవసరం!


ఐక్యరాజ్యసమితి హితవు

అమెరికా, నాటోలు రష్యా దూకుడును ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఆ రకంగా వాటి బలహీనత బయటపడింది. దాన్ని అలుసుగా తీసుకుని తైవాన్‌ను ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నించవచ్చు. రష్యా పూర్వ సోవియట్‌ యూనియన్‌ ఏలుబడిలోని ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకోవాలని చూస్తోంది. చైనా తమ పురాతన చక్రవర్తుల పాలనలోని ప్రదేశాలను మళ్ళీ తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకుంటోంది. ఆ రెండు దేశాల విస్తరణవాదం దీర్ఘకాలంలో ప్రపంచ గతిని మార్చేయవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఐక్యరాజ్య సమితి కాల్పులు విరమించాల్సిందిగా ఇరు దేశాలకూ విజ్ఞప్తి చేసింది. హింసతో సమస్యలు పరిష్కారం కావంటూ హితవు పలికింది.


- సాయి ప్రక్రిత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని