Electronics Mart India IPO: ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఐపీఓ ధరల శ్రేణి రూ.56-59

‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట వినియోగ వస్తువుల విక్రయశాలలను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ అక్టోబరు 4-7 తేదీల్లో జరగనుంది....

Published : 28 Sep 2022 16:51 IST

హైదరాబాద్‌: ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట వినియోగ వస్తువుల విక్రయశాలలను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ అక్టోబరు 4-7 తేదీల్లో జరగనుంది. ధరల శ్రేణిని రూ.56-59గా నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా దాదాపు రూ.500 కోట్లు సమీకరించేందుకు 2021 సెప్టెంబరులో కంపెనీ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.

ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.111.44 కోట్లు మూలధన వ్యయాలకు, రూ.220 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది. రూ.55 కోట్ల రుణభారాన్ని తగ్గించుకోనుంది. ఐపీఓలో అందుబాటులో ఉంచనున్న షేర్లలో దాదాపు సగానికి పైగా అర్హతగల మదుపర్లకు కేటాయించారు. మరో 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్ల కోసం ఉంచారు. మదుపర్లు కనిష్ఠంగా 254 షేర్లకు బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆనంద్‌ రాఠి అడ్వైజర్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట 112 విక్రయశాలలను నిర్వహిస్తోంది. ‘కిచెన్‌ స్టోరీస్‌’ పేరిట మరో రెండు స్టోర్లు కూడా దీని యాజమాన్యంలో ఉన్నాయి. వీటిలో పూర్తిగా వంటగదికి సంబంధించిన వస్తువులను విక్రయిస్తుంటారు. మరోవైపు ఇంట్లో ఉపయోగించే ఆడియో పరికరాల కోసం ‘ఆడియో అండ్‌ బియాండ్‌’ పేరిట ఒక ప్రత్యేక స్టోర్‌ను కూడా నిర్వహిస్తోంది. 2021-22లో ఈ కంపెనీ ఆదాయం 36 శాతం పెరిగి రూ.434.93 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని