Elon musk: మస్క్‌కు షాక్‌.. ఏడాదిలో 100 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి

ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. ఏడాదిలో మస్క్‌ సంపద దాదాపు 100.5 బిలియన్‌ డాలర్లు ఆవిరైనట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది.

Published : 22 Nov 2022 19:45 IST

వాషింగ్టన్: ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. ఏడాదిలో మస్క్‌ సంపద దాదాపు 100.5 బిలియన్‌ డాలర్లు ఆవిరైనట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. అయినప్పటికీ, 169.8 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన ప్రథమ స్థానంలోనే ఉన్నట్లు తెలిపింది. మస్క్‌కు ప్రధాన ఆదాయం టెస్లా షేర్ల వల్లే వస్తోంది. ఇటీవల ఆ షేర్లు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో మస్క్‌ భారీగా నష్టపోయారు. మరోవైపు ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు 19 బిలియన్‌ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను ఆయన విక్రయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంపద తరుగుతున్నట్లు తెలుస్తోంది.

గత నవంబరులో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనియర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం మస్క్‌ నికర సంపద 340 బిలియన్‌ డాలర్లు. అయితే టెస్లా షేర్ల విలువ పడిపోవడంతో ఆయన సంపద 170 బిలియన్‌డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. టెస్లాలో మస్క్‌ 15 శాతం వాటా కలిగిన మస్క్‌.. సోమవారం ఒక్కరోజే 8.6 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. టెస్లా షేర్లు ఇప్పటి వరకు దాదాపు 58 శాతం మేర క్షీణించడంతో మస్క్‌ భారీ నష్టపోవాల్సి వచ్చింది. మస్క్‌ తర్వాతి స్థానంలో ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవస్తువుల తయారీ సంస్థ ఎల్‌వీఎంహచ్‌ మొయెట్‌ ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య తేడా కేవలం 13 బిలియన్‌ డాలర్లు మాత్రమే.

మరోవైపు టెస్లా కంపెనీకి అమెరికా తర్వాత అతిపెద్ద బిజినెస్‌ మార్కెట్‌  చైనా. అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కొవిడ్‌ పాలసీ వల్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు వివిధ సాంకేతిక కారణాలతో ఇటీవల అక్కడి నుంచి దాదాపు 3 లక్షలకు పైగా కార్లను టెస్లా సంస్థ రీకాల్‌ చేసింది. దీని ప్రభావంతో షేర్ల విలువ భారీగా పతనమైనట్లు తెలుస్తోంది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్‌ ఆయన దృష్టంతా దానిపైనే కేంద్రీకరిస్తున్నారని, దీని ప్రభావం టెస్లాపై పడుతోందని మదుపర్లు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని