EPFO: పీఎఫ్‌పై వడ్డీరేటు తగ్గింపు.. 4 దశాబ్దాల కనిష్ఠానికి..!

ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌‌-ఈపీఎఫ్‌ఓ)

Updated : 12 Mar 2022 14:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌‌-ఈపీఎఫ్‌ఓ) సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్‌పై వడ్డీరేటును 40 ఏళ్ల కనిష్ఠానికి తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ జమలపై 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు (సీబీటీ) శనివారం సమావేశమైంది. ఈ భేటీలోనే పీఎఫ్‌ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 8.1శాతం వడ్డీరేటు నిర్ణయాన్ని సీబీటీ కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది. ఆర్థికశాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత చందాదారులకు వడ్డీ జమ చేస్తారు.

కాగా.. ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం 1977-78 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ ఏడాది పీఎఫ్‌పై 8శాతం వడ్డీ ఇచ్చారు. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్‌ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5శాతంగా ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)కూడా ఇదే 8.5శాతం వడ్డీని కొనసాగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని