Embargo on Russian Oil: రష్యా ఖజానా ‘చమురు’ వదిలేలా.. ఈయూ కీలక నిర్ణయం!

రష్యా చమురు దిగుమతులపై ఐరోపా సమాఖ్య నిషేధం విధించింది.....

Updated : 31 May 2022 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తున్న రష్యాను నిలువరించే దిశగా ఐరోపా సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చమురు దిగుమతులపై పాక్షిక నిషేదాజ్ఞలు విధించింది. ఈ మేరకు 27 దేశాల సమాఖ్య రాజీతో కూడిన ఒప్పందానికి వచ్చింది.

పైప్‌లైన్‌ దిగుమతిపై నిషేధం లేదు..

పూర్తి స్థాయి నిషేధంపై గతకొన్ని వారాలుగా లోతైన చర్చలు జరిపిన ఈయూ ఎట్టకేలకు హంగేరీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో రాజీతో కూడిన ఆంక్షలకు ఒప్పుకోక తప్పలేదు. పైప్‌లైన్ మార్గంలో వచ్చే చమురు దిగుమతికి మాత్రం నిషేధం నుంచి మినహాయింపునిచ్చారు. సముద్రమార్గంలో నౌకల ద్వారా వచ్చే చమురుపై మాత్రమే పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఫలితంగా 67 శాతం దిగుమతులు తక్షణమే ఆగిపోతాయని ఈయూ కౌన్సిల్‌ చీఫ్‌ చార్లెస్‌ మిషెల్‌ వెల్లడించారు. యుద్ధం ఆపేలా రష్యాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఏడాది చివరికి 90 శాతం..

ఈ ఏడాది చివరికి రష్యా నుంచి ఐరోపా దేశాలకు వచ్చే చమురు దిగుమతులు 90 శాతం మేర తగ్గిపోతాయని ఈయూ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ ఉర్సులా వోన్ డెర్‌ లేయెన్‌ తెలిపారు. పోలాండ్‌, జర్మనీలు తమ ప్రాదేశిక ప్రాంతాల నుంచి వెళ్తున్న రష్యా పైప్‌లైన్‌ను నిలిపివేస్తామని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే రష్యాపై పాశ్చాత్య దేశాలు ఐదు దఫాల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విధించిన ఆరో విడత ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బకొట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మరికొన్ని ఆంక్షలు..

ఐరోపా సమాఖ్య దేశాల చమురు అవసరాల్లో దాదాపు 26 శాతం రష్యా నుంచే దిగుమతి అవుతోంది. ఓవైపు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ఐరోపా మరోవైపు రష్యా చమురును కొనుగోలు చేస్తూ పరోక్షంగా ఆయుధాలకు నిధులు సమకూరుస్తోందన్న విమర్శలు వినిపించాయి. తాజా ఆంక్షల్లో భాగంగా రష్యాలో అతిపెద్ద బ్యాంక్ అయిన బెర్‌బ్యాంక్‌ను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ ‘స్విఫ్ట్‌’ నుంచి నిషేధించారు. అలాగే క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉంటూ యుద్ధనేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరింత మందిపైనా ఆంక్షలు విధించింది. రష్యా ప్రభుత్వ అధీనంలో ఉండే మూడు ప్రసార మాధ్యమాలపైనా నిషేధం విధించారు. 

హంగేరీకి ఎందుకు మినహాయింపు..

హంగేరీ ప్రధాని విక్టర్‌ ఆర్బాన్‌ తొలి నుంచి రష్యా దిగుమతులపై నిషేధ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సముద్ర తీరం లేని హంగేరీ చమురు దిగుమతి చేసుకోవాలంటే పైప్‌లైన్‌లు ఒక్కటే మార్గం. మరోవైపు ఆ దేశ చమురు అవసరాల్లో 65 శాతం రష్యా నుంచి వస్తోంది. దీంతో చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా గుండా వస్తోన్న డ్రజ్‌బా పైప్‌లైన్‌కు మాత్రం కచ్చితంగా మినహాయింపునివ్వాల్సిందేనని విక్టర్‌ ఆర్బాన్‌ పట్టుబడుతూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆయన సముద్ర మార్గాన వస్తున్న దిగుమతులపైనే నిషేధం విధించాలని ప్రతిపాదించారు. లేదంటే హంగేరీ ఆర్థిక వ్యవస్తపై అణుబాంబు వేసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఉక్రెయిన్‌ గనక పైప్‌లైన్‌లను ధ్వంసం చేస్తే సముద్ర మార్గం ద్వారా కూడా చమురు సమకూర్చుకోవడానికి వెనుకాడబోమని విక్టర్‌ స్పష్టం చేశారు.

హంగేరీతో పాటు మరికొన్ని దేశాలకూ నిషేధం నుంచి మినహాయింపునిచ్చారు. అయితే, మినహాయింపు పొందిన దేశాలు కూడా రెండేళ్లలో ఆంక్షల్ని అమలు చేయాలని కోరారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. అయితే, హంగేరీ మాత్రం నాలుగేళ్ల సమయంతో పాటు 800 మిలియన్‌ యూరోల సాయాన్ని కోరింది. విక్టర్‌ ఆర్బాన్‌కు పుతిన్‌ సన్నిహితుడిగా పేరుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని