stock market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. ఎందుకంటే..?
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుంగాయి. నేడు ఒక్క సెషన్లో ఇప్పటికే మదుపర్ల సంపద ఒక దశలో దాదాపు రూ.7లక్షల కోట్లు ఆవిరైంది. ఒక దశలో సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనమైంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలివే..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుంగాయి. నేటి సెషన్లోనే మదుపర్ల సంపద ఒక దశలో దాదాపు రూ.7లక్షల కోట్లు ఆవిరైంది. అత్యధికంగా సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు కలగలిపి సూచీలను కూలదోశాయి. ఫలితంగా నిఫ్టీ 50 బలమైన ప్రతిఘటన స్థానాలను దాటుకొని మరీ పతనమైంది. ఇక పలు రంగాల సూచీలు దాదాపు 3శాతం కుంగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 2శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 1శాతం విలువ కోల్పోయాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రతికూల ధోరణిలో ఉండటంతో భారీ ఎత్తున అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఒక్క మే నెలలోనే వారు రూ.38,000 కోట్లు విలువైన పొజిషన్లను విక్రయించారు. భవిష్యత్తులో సూచీలు మరింత కుంగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గురువారం ఉదయం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.255.7 లక్షల కోట్లు ఉండగా.. అది సూచీలు పతనం మొదలయ్యాక రూ.249.17 లక్షల కోట్లకు చేరింది. మధ్యాహ్నం 2.25 గంటల సమయంలో సెన్సెక్స్ 1,360 పాయింట్లు పతనమై 52,840 వద్ద, నిఫ్టీ 410 పాయింట్లు కుంగి 15,830 వద్ద ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా ఒక్క సూచీ కూడా లాభాల్లో లేకపోవడం గమనార్హం.
బలహీనంగా ప్రపంచ మార్కెట్లు..
గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత పతనాన్ని నిన్న అమెరికా మార్కెట్లు చవిచూడటం భారత్ సూచీల కుంగుబాటుకు ఆజ్యం పోసింది. అమెరికా మార్కెట్లలో కూడా మాంద్యం భయాలు నెలకొన్నాయి. అక్కడ ద్రవ్య పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నారనే ప్రచారం.. వాల్స్ట్రీట్లో గుబులు రేపుతోంది. నిన్నటి ట్రేడింగ్లో డోజోన్స్ 3.2 శాతం పడిపోగా.. ఎస్అండ్పీ 500 సూచీ 3.6శాతం విలువ కోల్పోయింది. నాస్డాక్ కాపోజిట్ 4.3శాతం పతనమైంది. అమెరికా రిటైల్ దిగ్గజం టార్గెట్ షేర్లు 25శాతం పతనమయ్యాయి. 1987 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో దాని షేర్లు ఎన్నడూ పడిపోలేదు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో ఆసియా సూచీలు కూడా ప్రతికూలంగానే ట్రేడవుతున్నాయి. హాంగ్కాంగ్ సూచీ 2.25శాతం పతనమైంది. చైనా టెక్ దిగ్గజం టెన్సెంట్ షేరు 6శాతం విలువ కోల్పోయింది. నిక్కీ 225 సూచీ 1.75శాతం విలువ కోల్పోగా.. దక్షిణ కొరియాకు చెందిన కేవోఎస్పీఐ 1.34శాతం పడిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్ఎక్స్200 సూచీ 1.61శాతం పతనమైంది.
40 ఏళ్లలో ఎన్నడూ లేని ధరలు..!
అమెరికాలో వినిమయ వస్తువుల ధరలు 8.2శాతం పెరిగాయి. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో అక్కడ ఏనాడూ ధరలు పెరగలేదు. దీంతో ఫెడ్ వడ్డీరేట్ల పెంపును నమ్ముకొంది. ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ కూడా వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని వెల్లడించారు. జూన్14-15 తేదీల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ భేటీ కానుంది. అమెరికాలో నిరుద్యోగం రేటు ఏప్రిల్ నెలలో 3.6శాతంగా నిలిచింది. కొవిడ్ వ్యాప్తికి ముందున్న 3.5శాతం కంటే ఇది కొంచెం ఎక్కువ. నిరుద్యోగుల సంఖ్య 10లక్షలను దాటేసింది.
వడ్డీరేట్లపై ఆర్బీఐ దృష్టి..
ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల వలే ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లపెంపుపై దృష్టి సారించింది. మే4 వ తేదీన ఆర్బీఐ భేటీలో ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్ల పెంపును ఆయుధంగా వాడటంపై చర్చ జరిగింది. దీంతో భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
భగభగలాడుతున్న చమురు ధరలు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏడు వారాల్లో అత్యధికంగా బ్రెంట్ క్రూడ్ పీపా ధర 110 డాలర్లకు చేరింది. చాలా దేశాలు రష్యా చమురుపై నిషేధం విధించడంతో ఏర్పడిన కొరత కూడా ఈ ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది. దీనికి తోడు చైనాలో 11శాతం తక్కువగా క్రూడ్ ప్రాసెస్ చేయడం సరఫరాలపై ఒత్తిడి పెంచుతోంది.
రూపాయ పతనం..
రుపాయ పతనం కొనసాగడం మార్కెట్ను ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం కూడా రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ.77.74 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది రూపాయి 4శాతం విలువ కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!