Economic Survey 2022: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8-8.5% వృద్ధిరేటు..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రేపు దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 2021-22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు.
లోక్సభ ముందుకు ఆర్థిక సర్వే
దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రేపు దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 2021-22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మధ్యాహ్నం ఆర్థికశాఖ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఆర్థిక సర్వే 2022 వివరాలను వెల్లడించనుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.2శాతంగా నమోదవ్వొచ్చని సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు నాటి స్థితికి తిరిగి చేరుకుంటుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. మహమ్మారి వల్ల అతి తక్కువగా ప్రభావితమైందని సర్వే చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 3.9శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. ఇక, సేవల రంగంలో 8.2 శాతం, వినియోగంలో 7.0శాతం వృద్ధి ఉండొచ్చని సర్వే తెలిపింది.
ఆర్థిక సర్వే అంటే..
గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్ సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతిఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే.. రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలు చేస్తుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) ఆధ్వర్యంలో ఈ నివేదిక రూపొందిస్తారు. అయితే ఈ ఏడాది సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణియం పదవీకాలం డిసెంబరుతో ముగియడంతో సీఈఏ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ప్రధాన ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈసారి ఆర్థిక సర్వేను రూపొందించారు. కేంద్ర నూతన ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారు. అయితే ఆర్థిక సర్వే రూపకల్పన నాటికి ఈయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు.
ఈ సారి ఒకే విభాగంలో..
సాధారణంగా ప్రతి ఏటా ఈ సర్వేను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టేవారు. తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. రెండో విభాగంలో మాత్రం ప్రస్తుత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవివరంగా పొందుపర్చేవారు. అయితే ఈ ఏడాది అన్ని వివరాలను ఒకే దాంట్లో కలిపి సింగిల్ వాల్యూమ్గా ఆర్థిక సర్వేను విడుదల చేశారు.
సర్వేలో ఏముంటుంది..
బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలనూ ఈ సర్వే విశ్లేషిస్తుంది. వీటితో పాటు వచ్చే ఏడాది ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను కూడా ఈ సర్వే సూచిస్తుండడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
బడ్జెట్కు దీనికి తేడా ఏంటంటే..
కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో మాత్రం ప్రస్తుత సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు విశ్లేషణ, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అందుకే ఈ ఆర్థిక సర్వే ఆధారంగానే కేంద్ర బడ్జెట్ను రూపొందిస్తారు.
బడ్జెట్ కన్నా ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1964 వరకు సాధారణ బడ్జెట్తోనే కలిపి ప్రవేశపెట్టేవారు. కానీ, 1964 నుంచి దీన్ని బడ్జెట్ కన్నా ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవడం కోసమే ఆర్థిక సర్వేను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల గగ్గోలు.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ