Air India: విస్తారా ఉండదు.. విలీనం తర్వాత ఇక ఎయిరిండియానే: సీఈఓ

Air India- Vistara merger: విస్తారా విలీనం అనంతరం విలీన సంస్థ ఎయిరిండియానే కొనసాగుతుందని కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ చెప్పారు. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపే అందుకు కారణమన్నారు.

Updated : 27 Feb 2023 17:26 IST

దిల్లీ: అంతర్జాతీయ విమానయాన రంగంలో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించాలని భావిస్తున్న టాటాల (Tata group) నేతృత్వంలోని ఎయిరిండియా (Air India).. అందుకు అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల భారీ ఎత్తున విమాన కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చిన ఆ కంపెనీ.. మరోవైపు విస్తారా విలీనంపైనా దృష్టి సారించింది. అయితే, విలీనం అనంతర సంస్థను ఎయిరిండియాగానే వ్యవహరిస్తామని ఎయిరిండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Campbell Wilson) వెల్లడించారు. విదేశాల్లో ఎయిరిండియాకు ఆ స్థాయిలో గుర్తింపు ఉండడమే కారణమన్నారు. ఈ మేరకు వర్చువల్‌గా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘విస్తారాకు భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. అయితే, భారత మార్కెట్‌ ఆవల మాత్రం ఎయిరిండియాకు అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉంది. 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఎయిరిండియా పేరు విలీన సంస్థకూ కొనసాగించనున్నాం. విస్తారా వారసత్వాన్ని మాత్రం కొంతమేర విలీన సంస్థలోనూ కొనసాగించాలని అనుకుంటున్నాం’’ అని విల్సన్‌ వెల్లడించారు. ప్రస్తుతం విలీన ప్రక్రియ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) నుంచి అనుమతులు తీసుకోవడం వద్ద ఉందని తెలిపారు.

ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాక టాటా గ్రూప్‌ ఎయిరిండియాపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మరో విమానయాన కంపెనీ విస్తారాను విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్‌ దీన్ని నిర్వహిస్తోంది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటా ఉండగా.. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు మిగిలిన వాటా ఉంది. విలీనం అనంతరం ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దఖలు పడనుంది. అనుకున్నట్లు అన్ని అనుమతులూ లభిస్తే 2024 మార్చి నాటికి విలీన ప్రక్రియ పూర్తవుతుంది. ఇది జరిగితే దేశానికి చెందిన అది పెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించనుంది. దేశీయంగా రెండో అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థగా నిలవనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని