Adani: 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో గుజరాత్‌లో పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌: అదానీ

చమురు రసాయనాల వ్యాపారంలోకీ  అదానీ గ్రూప్‌ అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా గుజరాత్‌లో 4 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు.

Published : 25 Nov 2022 22:55 IST

దిల్లీ: బొగ్గు గనులు, నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు వంటి పలు వ్యాపారాల్లో కొనసాగుతున్న అదానీ గ్రూప్‌.. చమురు రసాయనాల వ్యాపారంలోకీ అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా గుజరాత్‌లో 4 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. మూడు నుంచి ఆరు నెలల్లోపు ఓ సూపర్‌ యాప్‌నూ తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

గుజరాత్‌లో పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు 4 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ తెలిపారు. ఇప్పటికే ఈ రంగంలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రగామిగా ఉంది. అదానీ ప్రవేశంతో పోటీ తీవ్రతరం అవుతుంది కదా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ ఉండబోదని అదానీ అన్నారు. భారత్‌లో వృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొన్నారు.

ఇక ఎన్డీటీవీ స్వాధీనంపైనా మాట్లాడారు. ఎన్డీటీవీ కొనుగోలు అనేది ఓ బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్టీటీవీ వ్యవస్థాపకుడైన ప్రణయ్‌ రాయ్‌ను ఇకపైనా అధిపతిగా ఉండాలని తాను కోరినట్లు తెలిపారు. స్వత్రంత మీడియా సంస్థ అంటే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిందించడంతో పాటు.. మంచి చేసినప్పుడు ప్రోత్సహించాలన్నారు. ఎన్డీటీవీ కొనుగోలులో భాగంగా దాదాపు 29 శాతం వాటాలను దక్కించుకున్న అదానీ గ్రూప్‌.. మరో 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 5 వరకు ఓపెన్‌ ఆఫర్‌ కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని