మార్చి కల్లా 3 లక్షల ఐటీ ఉద్యోగాలు

కొత్త సాంకేతికతల వినియోగం పెరుగుతుండటంతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐటీ-బీపీఎం) పరిశ్రమలో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని టీంలీజ్‌ డిజిటల్‌ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే,

Published : 02 Aug 2022 02:27 IST

టీంలీజ్‌ నివేదిక

ముంబయి: కొత్త సాంకేతికతల వినియోగం పెరుగుతుండటంతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐటీ-బీపీఎం) పరిశ్రమలో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని టీంలీజ్‌ డిజిటల్‌ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఇవి 7 శాతానికి పైగానే పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దేశీయంగా ప్రస్తుతం ఐటీ-బీపీఎం రంగాల్లో 51 లక్షల ఉద్యోగులున్నారని, వచ్చే మార్చి కల్లా ఈ సంఖ్య 54 లక్షలకు చేరుతుందని పేర్కొంది. డిజిటల్‌ నైపుణ్యాల ఉద్యోగాల్లో 8.4 శాతం వృద్ధి కనిపించే అవకాశం ఉందని వెల్లడించింది. దాదాపు 500 నగరాల్లోని పలు ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు పేర్కొంది.

టెక్నాలజీ సంస్థల్లో ఒప్పంద ఉద్యోగుల సంఖ్యా 21 శాతంపెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఐటీ సేవల సంస్థలు ఒప్పంద ఉద్యోగాలను తీసుకునేందుకు ముందుకు వస్తాయని పేర్కొంది. పలు సంస్థలు కొత్తతరం సాంకేతికతలను వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని టీంలీజ్‌ డిజిటల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సి సునీల్‌ తెలిపారు. రాబోయే కొన్నేళ్లల్లోనే ఐటీ పరిశ్రమలో ఉన్న ఉద్యోగుల సంఖ్య కోటిని దాటుతుందని అంచనా వేశారు. ఐటీ-బీపీఎం రంగంలో వలసలూ అధికంగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒప్పంద ఉద్యోగుల విషయంలో ఇది 49 శాతం నుంచి పెరిగి 50-55 శాతానికి చేరుకోవచ్చని టీంలీజ్‌ అంచనా వేసింది. ఐటీ-బీపీఎం పరిశ్రమలో లింగ వైవిధ్యం ఈ ఏడాదిలో 25 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని సునిల్‌ తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ పరిశ్రమలోని సంస్థలు మానవ వనరుల్లో లింగ సమానత్వం ఉండేలా ప్రోత్సహిస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని