ఇక మినహాయింపులు లేని కొత్త పన్ను విధానమేనా?

ప్రస్తుతం ఆదాయపు పన్ను విధింపునకు రెండు రకాల మార్గాలున్నాయి. కొన్ని రకాల వ్యయాలు, మదుపుపై మినహాయింపులు ఇస్తూ, ఆదాయంపై ఎక్కువ పన్నురేటు విధిస్తున్నది ఒకటి అయితే.. ఎటువంటి మినహాయింపులు లేకుండా, ఆదాయానికి

Updated : 15 Aug 2022 02:14 IST

ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు

దిల్లీ: ప్రస్తుతం ఆదాయపు పన్ను విధింపునకు రెండు రకాల మార్గాలున్నాయి. కొన్ని రకాల వ్యయాలు, మదుపుపై మినహాయింపులు ఇస్తూ, ఆదాయంపై ఎక్కువ పన్నురేటు విధిస్తున్నది ఒకటి అయితే.. ఎటువంటి మినహాయింపులు లేకుండా, ఆదాయానికి తక్కువ పన్నురేటు విధించేది మరొకటి. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘మినహాయింపులు లేని కొత్త పన్ను విధానం’లోకి అత్యధికులను ఆకర్షించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లలో ఎక్కువ మంది కొత్త పన్ను విధానానికి మారేందుకు వీలుగా, కొన్ని మార్పుచేర్పులు చేస్తారని సమాచారం.  ఇప్పటి వరకు పన్ను చెల్లింపుదార్లు ఏ పన్ను విధానం కావాలంటే దాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. సంక్లిష్టమే అయినా పాత పన్ను విధానంలోనే ఎక్కువ మంది కొనసాగుతున్నారు. పిల్లల చదువులు పూర్తయి, ఇంటి రుణం తీరిపోయిన వారు మాత్రమే కొత్త విధానానికి మారుతున్నట్లు గుర్తించారు. అందుకే సరళంగా ఉండే కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఇందులో వార్షికాదాయం రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. ఆ తర్వాత రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5-7.5 లక్షల వరకు 10 శాతం, రూ.7.5-10 లక్షల వరకు 15 శాతం, రూ.10-12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5-15 లక్షల వరకు రూ.25 శాతం, రూ.15 లక్షలపైన 30 శాతం పన్ను విధిస్తున్నారు.

* కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదార్లకు కూడా 2019 సెప్టెంబరు నుంచి కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించి, మినహాయింపులు, ప్రోత్సాహకాలు తీసేసింది. 2019 అక్టోబరు 1 తర్వాత ఏర్పాటైన తయారీ కంపెనీలు, 2024 మార్చి 31లోపు కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలకు గతంలో ఉన్న 25 శాతం పన్నును 15 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఈ పన్ను విధానానికి మారిన కంపెనీలు మినహాయింపులు, ప్రోత్సాహకాలు వదులుకోవాలి.

* కార్పొరేట్‌ పన్నును తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తినా, ఇటీవల కార్పొరేట్‌ పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లను కూడా కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకునేలా దాన్ని ఆకర్షణీయంగా తీసుకొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని