వలసలు అధికంగానే ఉంటాయ్‌

‘అధిక వేతనం పొందడంతో పాటు, వృత్తి జీవితంలో పైకెదగాలనే ఆకాంక్ష, సౌకర్యవంతమైన పని పద్ధతులు కావాలనే ధోరణి 26 - 41 ఏళ్ల (మిలీనియల్స్‌) ఉద్యోగుల్లో అధికంగా ఉంది.

Published : 19 Aug 2022 03:06 IST

అధిక వేతనం, పదోన్నతులే యువత లక్ష్యం
పీడబ్ల్యూసీ ఇండియా సర్వే

దిల్లీ: ‘అధిక వేతనం పొందడంతో పాటు, వృత్తి జీవితంలో పైకెదగాలనే ఆకాంక్ష, సౌకర్యవంతమైన పని పద్ధతులు కావాలనే ధోరణి 26 - 41 ఏళ్ల (మిలీనియల్స్‌) ఉద్యోగుల్లో అధికంగా ఉంది. రాబోయే ఏడాది కాలంలో వేరే సంస్థకు మారాలనుకుంటున్నామని దేశంలో 34 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సిబ్బంది వలసలు అధికంగానే ఉండనున్నాయి. కొవిడ్‌ తీవ్రత సర్దుమణిగినా, కార్యాలయాలకు వచ్చేందుకూ సుముఖత చూపడం లేదు. ఇంటి నుంచి / హైబ్రిడ్‌ విధానంలో పనిచేసేందుకే ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు’ అని పీడబ్ల్యూసీ ఇండియా సర్వే పేర్కొంది. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలున్న వారి కొరతా, వలసలకు కారణమని విశ్లేషించింది. దేశంలో 2,688 మంది నుంచి అభిప్రాయాలు సేకరించామని, వీరిలో 93 శాతం మంది పూర్తికాల ఉద్యోగులని సంస్థ పేర్కొంది. ఈ ప్రకారం.నీ వేరే సంస్థకు మారదామనుకుంటున్నామని మన దేశంలో మొత్తంమీద 34 శాతం (మిలీనియల్స్‌లో 37 శాతం) మంది తెలిపారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 19 శాతంగానే ఉంది.
* ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలే యోచనలో 32 శాతం మంది ఉన్నారు. వీళ్లు వేరే కంపెనీకి మారాలని అనుకోవడం వెనక ఇప్పుడు చేస్తున్న కంపెనీ నచ్చట్లేదన్నదే కారణమై ఉండకపోవచ్చు. పైగా ఈ అభిప్రాయం ఉన్న యువతలో 50 శాతం మంది, తాము పనిచేస్తున్న సంస్థ భద్రమైనదని ఇతరులకు సూచిస్తున్నారు కూడా.
*ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడంపై దృష్టి పెట్టలేకపోయామని దేశీయంగా 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమ విధులను ఇంటి నుంచి అయినా చేయొచ్చని 81 శాతం మంది పేర్కొన్నారు.
* 18-25 ఏళ్ల (జనరేషన్‌ జెడ్‌) ఉద్యోగుల్లో కంపెనీ మారేందుకు ఆసక్తి చూపుతున్న వాళ్లు తక్కువే. అయితే వీళ్లలో మూడింట ఒక వంతు మంది పని గంటలు తగ్గించాలని కోరుకుంటున్నారు.
*సహోద్యోగుల నుంచి సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశాలు లేకపోవడంపై సగం మందికి పైగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత హోదా స్థాయిల్లోనే (సీఈఓలు) శిక్షణకు సంబంధించి తారతమ్యాలు ఎక్కువగా ఉన్నాయి.  
*పని ప్రాంతాల్లో జరిగే చర్చల్లో సున్నిత అంశాలైన సామాజిక, రాజకీయ విషయాలపైనే 75 శాతం మంది మాట్లాడుకుంటున్నారు. ఈ తరహా చర్చలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉద్యోగ సంస్థలపై ఉంది.
*సామాజిక, పర్యావరణ, ఆర్థిక, భౌగోళిక, రాజకీయంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి కంపెనీలకు ఏర్పడిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌, లీడర్‌ చైటాలి ముఖర్జీ తెలిపారు. సంస్థల కోసం, తమ సిబ్బంది కోసం స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించే ముందు ఈ మార్పులను కంపెనీల అధిపతులు దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని