ఇంధన స్వావలంబనే ధ్యేయం

వచ్చే 25 ఏళ్లలో ఇంధన రంగంలో స్వావలంబన సాధించడమే భారత్‌ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిశ్శబ్దంగా దూసుకెళ్లే విద్యుత్‌ వాహనాలే (ఈవీ) ఈ నిశ్శబ్ద విప్లవంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.

Published : 29 Aug 2022 02:48 IST

రూ.7300 కోట్లతో సుజుకీ బ్యాటరీ ప్లాంట్‌
రూ.11,000 కోట్లతో ఎంఎస్‌ఐ వాహన యూనిట్‌

గాంధీనగర్‌: వచ్చే 25 ఏళ్లలో ఇంధన రంగంలో స్వావలంబన సాధించడమే భారత్‌ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిశ్శబ్దంగా దూసుకెళ్లే విద్యుత్‌ వాహనాలే (ఈవీ) ఈ నిశ్శబ్ద విప్లవంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడి మహత్మా మందిర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మాట్లాడారు. సుజుకీ మోటార్‌, గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో రూ.7300 కోట్లతో నిర్మిస్తున్న ఈవీ బ్యాటరీ ప్లాంట్‌, రూ.11,000 కోట్లతో హరియాణాలోని సోనీపట్‌లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) నిర్మిస్తున్న కొత్త వాహన ప్లాంట్‌లకు ఇక్కడినుంచే మోదీ శంకుస్థాపన చేశారు. వాహన, వాహన విడిభాగాల తయారీలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) తీసుకురానున్నట్లు ప్రధాని వెల్లడించారు.  

భారత్‌-జపాన్‌ సంబంధాలకు మారుతీ సూచిక

బలమైన భారత్‌-జపాన్‌ భాగస్వామ్యానికి మారుతీ సుజుకీ విజయాలే సూచికని మోదీ అన్నారు. ‘గుజరాత్‌- మహారాష్ట్ర బులెట్‌ ట్రైన్‌ నుంచి బనారస్‌లోని రుద్రాక్ష కేంద్రం వరకు చాలా అభివృద్ధి ప్రాజెక్టులు ఇరు దేశాల స్నేహానికి ఉదాహరణలుగా నిలిచాయి. జపాన్‌ దివంగత ప్రధాని షింజో అబే ఇందుకు కృషి చేయగా.. ప్రస్తుత ప్రధాని కిషిదా మరింత ముందుకు తీసుకెళ్తున్నారు’ అని పేర్కొన్నారు. జపాన్‌-భారత్‌ మధ్య బలమైన ఆర్థిక సంబంధాలకు మారుతీ సుజుకీ 4 దశాబ్దాల క్రితం పునాదులు వేసిందని కిషిదా వీడియో సందేశంలో అన్నారు. కొత్త కంపెనీ సుజుకీ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు తొషిహిరో సుజుకీ ఈ సందర్భంగా ప్రకటించారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సుజుకీ గ్రూప్‌ దాదాపు 28 లక్షల వాహనాలు ఉత్పత్తి చేయగా, ఇందులో 16 లక్షలు భారత్‌లోనే ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు.  2025లో గుజరాత్‌లోనే విద్యుత్తు కారును తయారు చేస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ చెప్పారు.

* వాహన తయారీ కేంద్రంగా హరియాణా అవతరించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అన్నారు.  మారుతీ సుజుకీ కొత్త ప్లాంటు వల్ల, ఏడాదికి 10 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్లలో ఒకటిగా ఇది నిలవనుందని ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని