చిప్‌ సెట్‌ రూ.80 లక్షల కోట్లు

కార్లు, బైక్‌లు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల రంగాల నుంచి సెమీ కండక్టర్‌ చిప్‌సెట్లకు గిరాకీ అనూహ్యంగా పెరుగుతోంది. కొవిడ్‌ పరిణామాల వల్ల, గతేడాది గిరాకీకి అనుగుణంగా వీటి సరఫరాలు సాధ్యం కాలేదు. ఇప్పటికీ పరిశ్రమల అవసరాలకు సరిపడా సెమీకండక్టర్ల సరఫరా ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల మార్కెట్‌

Updated : 04 Sep 2022 08:24 IST

2030 నాటికి దేశీయ మార్కెట్‌ విలువ

డిజైన్‌ సేవలకూ గిరాకీ

పరిశోధన, ఉత్పత్తి విస్తరించే అవకాశం

కార్లు, బైక్‌లు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల రంగాల నుంచి సెమీ కండక్టర్‌ చిప్‌సెట్లకు గిరాకీ అనూహ్యంగా పెరుగుతోంది. కొవిడ్‌ పరిణామాల వల్ల, గతేడాది గిరాకీకి అనుగుణంగా వీటి సరఫరాలు సాధ్యం కాలేదు. ఇప్పటికీ పరిశ్రమల అవసరాలకు సరిపడా సెమీకండక్టర్ల సరఫరా ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల మార్కెట్‌ 2030 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.80 లక్షల కోట్ల)కు చేరుతుందని హైదరాబాద్‌కు చెందిన మాస్‌ చిప్‌ టెక్నాలజీస్‌ వార్షిక సమావేశంలో (ఏజీఎం)లో సీఈఓ వెంకట్‌ సింహాద్రి అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం భారత్‌కు ఉందన్నారు. మనదేశంలో వీఎల్‌ఎస్‌ఐ/ ఎంబెడెడ్‌ డిజైన్‌ సర్వీసెస్‌ మార్కెట్‌ వచ్చే ఏడాదిలో 7.37 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రధానంగా వాహన, డేటా స్టోరేజ్‌, వైర్‌లెస్‌ విభాగాల నుంచి అధిక డిమాండ్‌ ఉంటుందని సమాచారం.

డిజైనింగ్‌లో దేశీయంగా లక్ష మంది

చిప్‌ డిజైన్‌లో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లక్ష మందికి పైగా చిప్‌ డిజైన్‌ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. దేశీయ సంస్థల్లో విప్రో, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమినీ, ఎల్‌అండ్‌టీ ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ విభాగంలో మనదేశం వచ్చే కొంతకాలం పాటు రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని భావిస్తున్నారు. సెమీకండక్టర్ల కోసం మనదేశం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇటీవలి పరిణామాలకు తోడు, ఎలక్ట్రానిక్స్‌ తయారీలో భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం..  ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.80,000 కోట్ల) పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల చిప్‌లు, డిస్‌ప్లే, చిప్‌ డిజైన్‌ విభాగాల్లో కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఏర్పడింది. కనీసం 100 కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వ వర్గాల అంచనా.

అమెరికా రెండు దశాబ్దాలుగా సెమీకండక్టర్‌ పరిశోధన- డిజైనింగ్‌ సేవలకు పరిమితమై, ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించలేదు. ఫలితంగా తైవాన్‌, కొరియా, జపాన్‌, చైనాలో సెమీకండక్టర్‌ ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగాయి. తాజాగా అమెరికా ప్రభుత్వం సెమీకండక్టర్‌ ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించింది. ఇందుకోసం ‘చిప్స్‌ యాక్ట్‌’ ను ఆమోదించింది. ఇంటెల్‌ అతిపెద్ద చిప్‌సెట్‌ తయారీ ప్లాంటును నిర్మించనుంది. అమెరికాలో సెమీకండక్టర్‌ ఉత్పత్తి విభాగంలో 52 బి.డాలర్ల (సుమారు రూ.4.16 లక్షల కోట్ల) పెట్టుబడులు సమకూరతాయని అంచనా. ఈ పరిణామాలను విశ్లేషిస్తే వచ్చే కొన్నేళ్ల పాటు సెమీకండక్టర్ల రంగం వేగంగా విస్తరించనుందని స్పష్టమవుతోంది. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడానికి మనదేశమూ సిద్ధం కావడం ఆసక్తికర పరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

20 సంస్థలకు సేవలు

మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 అగ్రగామి సెమీకండక్టర్‌ కంపెనీలకు సేవలు అందిస్తోంది. దాదాపు వెయ్యి మంది సిబ్బందితో వేగంగా తమ సేవలను విస్తరిస్తోంది. పీఎల్‌ఐ పథకంలో పాల్గొనే అవకాశం తమకు లేదని, దీనికి బదులుగా డీఎల్‌ఐ పథకంతో లబ్ధి పొందేందుకు వీలుగా సెమీకండక్టర్‌ ఉత్పత్తులు / మేధోసంపత్తి (ఐపీ) హక్కులపై దృష్టి సారిస్తున్నట్లు మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని