మారుతీ ఎస్‌యూవీలకు రూ.25,000 కోట్ల ఆర్డర్లు!

స్పోర్ట్స్‌ వినియోగ వాహన (ఎస్‌యూవీ) విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా దూసుకెళ్తోంది. కొత్త బ్రెజా, గ్రాండ్‌ విటారా మోడళ్ల కోసం కంపెనీ చేతిలో  రూ.25,000 కోట్ల విలువైన 1.40 లక్షలకు పైగా ముందస్తు బుకింగ్‌లు ఉండటమే ఇందుకు నిదర్శనం.

Published : 23 Sep 2022 02:54 IST

ముంబయి: స్పోర్ట్స్‌ వినియోగ వాహన (ఎస్‌యూవీ) విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా దూసుకెళ్తోంది. కొత్త బ్రెజా, గ్రాండ్‌ విటారా మోడళ్ల కోసం కంపెనీ చేతిలో  రూ.25,000 కోట్ల విలువైన 1.40 లక్షలకు పైగా ముందస్తు బుకింగ్‌లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం మారుతీ స్విఫ్ట్‌, బాలెనో వంటి హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్లు వినియోగిస్తున్న వారు కూడా ఎస్‌యూవీలకు మారడానికి మొగ్గుచూపుతున్నందునే, ఇంత భారీ ఆర్డర్లు వచ్చేందుకు కారణమని సంస్థ చెబుతోంది. మరింత అధిక స్థలం, అధునాతన భద్రతా ఫీచర్లు ఎస్‌యూవీల్లో ఉండటం ఆకర్షిస్తోంది.  

* కంపెనీ ఇప్పటివరకు దాదాపు 45,000 బ్రెజా కార్లను వినియోగదార్లకు అందజేసింది. గ్రాండ్‌ విటారా డెలివరీలను ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఎక్కువ బుకింగ్‌లు హై-ఎండ్‌ మోడళ్లకే వస్తున్నాయి. దీంతో సగటు విక్రయ ధరతో పాటు వాహనంపై లభించే మార్జిన్‌ పెరుగుతోంది.

* కొత్త బ్రెజా, విటారా సగటు ధర  రూ.15 లక్షలకు పైగా ఉంది. 1.40 లక్షల వాహనాల విలువ రూ.25,000 కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అంచనా వేసిన ఆదాయంలో ఇది నాలుగో వంతుకు సమానం కావడం విశేషం.

* ప్రస్తుత ఆర్థికంలో విడుదల చేసిన ఎర్టిగా, ఎక్స్‌6 మోడళ్లకు ఉన్న ఆర్డర్లనూ కలుపుకుంటే కంపెనీ చేతిలో రూ.35,000 కోట్ల విలువైన 2,40,000 కార్లకు బుకింగ్‌లు ఉన్నాయి.  కొత్త మోడళ్లకు బలమైన గిరాకీతో కంపెనీ వార్షిక ఎస్‌యూవీ విక్రయాలు రెట్టింపై 3,00,000కు చేరొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని