అంచనాల కంటే తక్కువగా ఆదాయం: యాక్సెంచర్‌

తొలి త్రైమాసిక (సెప్టెంబరు-నవంబరు) ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదవుతుందని ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్‌ పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలో సంస్థ 16.07 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా,

Published : 23 Sep 2022 02:54 IST

దిల్లీ: తొలి త్రైమాసిక (సెప్టెంబరు-నవంబరు) ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదవుతుందని ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్‌ పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలో సంస్థ 16.07 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా, అసెంచర్‌ మాత్రం ఇది 15.20-15.75 బి.డా. మాత్రమే ఉండొచ్చని భావిస్తోంది. డాలర్‌ బలోపేతం అవ్వడం వల్ల, విదేశీ కరెన్సీల రూపేణ వచ్చే ఆదాయం మొత్తం తగ్గిపోతుంది. ఐటీ కంపెనీలకు ఇది ఇబ్బంది కలిగించే అంశం. తమ ఆదాయంపై 8.5 శాతం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అసెంచర్‌ అంచనా వేస్తోంది.

కారణాలివీ: అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఐటీ వ్యయాలను వివిధ రంగాల సంస్థలు తగ్గించడం, డాలర్‌ విలువ ఎక్కువ కావడం కూడా ప్రభావం చూపుతుందని అసెంచర్‌ తెలిపింది. అనేక దేశాల కరెన్సీలతో డాలరు మారకపు విలువ రెండు దశాబ్దాల గరిష్ఠస్థాయికి చేరింది. ఈ ఏడాదిలోనే డాలర్‌ మారకపు విలువ 16 శాతం పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు పెంచడం ఇందుకు కారణమైంది. ఇందువల్ల మైక్రోసాఫ్ట్‌, సేల్స్‌ఫోర్స్‌, ఐబీఎం వంటి అగ్రశ్రేణి సంస్థల విదేశీ కార్యకలాపాలపైనా ప్రభావం పడింది. ఆర్థిక మందగమనం వల్ల, ఐటీ వ్యయాలు గణనీయంగా తగ్గే వీలుంది. అందుకే సేల్స్‌ఫోర్స్‌ కూడా తన ఆదాయ, లాభాల అంచనాలను తగ్గించింది.

* ఆగస్టు త్రైమాసికంలో మాత్రం విశ్లేషకుల అంచనా (15.39 బి.డా.)కు అనుగుణంగానే అసెంచర్‌ 15.40 బి.డా. ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. సంస్థ సెప్టెంబరు-ఆగస్టును ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని