గోదాములకు గిరాకీ

దేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గోదాముల అద్దె లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం వృద్ధి కనిపించింది. మొత్తంగా 5.13 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని గోదాముల స్థలం అద్దెకు వెళ్లిందని స్థిరాస్తి

Published : 25 Sep 2022 02:17 IST

 హైదరాబాద్‌లో 128% పెరిగిన అద్దె లావాదేవీలు  
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే ధోరణి

ఈనాడు, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గోదాముల అద్దె లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం వృద్ధి కనిపించింది. మొత్తంగా 5.13 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని గోదాముల స్థలం అద్దెకు వెళ్లిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. ప్రధానంగా థర్డ్‌పార్టీ లాజిస్టిక్‌ సంస్థలు, ఇ-కామర్స్‌ సంస్థల నుంచి గిరాకీ ఉందని ‘ఇండియా వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌ రిపోర్ట్‌- 2022’లో వెల్లడించింది. హైదరాబాద్‌ రికార్డు స్థాయిలో 128 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 23.6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అద్దెకు తీసుకోగా.. 2021-22లో 54లక్షల చదరపు అడుగుల్లో లీజింగ్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో మేడ్చల్‌లో దాదాపు 60 శాతం, శంషాబాద్‌ ప్రాంతంలో 30 శాతం స్థలాలు అద్దెకు వెళ్లాయి.
* దేశ రాజధాని దిల్లీలో 91 లక్షల చదరపు అడుగుల్లో గోదాముల అద్దె లావాదేవీలు జరిగాయి. ముంబయిలో 86 లక్షలు, పుణెలో 75 లక్షలు, బెంగళూరులో 59 లక్షలు, అహ్మదాబాద్‌లో 53 లక్షలు, చెన్నైలో 51 లక్షలు, కోల్‌కతాలో 43 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాముల స్థలం లీజింగ్‌కు వెళ్లింది. కొనుగోళ్లు, జీడీపీలో వృద్ధి కనిపిస్తుండటంతో గోదాముల అద్దె లావాదేవీలూ సానుకూలంగా సాగుతున్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు.

విశాఖలో...: ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో గోదాముల అద్దె లావాదేవీలు 228 శాతం పెరిగాయని నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లావాదేవీలు జరగగా.. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో లక్ష చదరపు అడుగుల స్థలమే అద్దెకు వెళ్లిందని పేర్కొంది. ఇ-కామర్స్‌, థర్డ్‌ పార్టీ లాజిస్టిక్‌ సేవలను అందించే సంస్థల నుంచి గిరాకీ పెరిగిందని తెలిపింది. మొత్తం స్థలంలో గాజువాక- ఆటో నగర్‌ క్లస్టర్‌లో 87 శాతం అద్దెకు వెళ్లగా, మధురవాడ ప్రాంతంలో 13 శాతం లీజింగ్‌ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని