పెట్రోబ్రాస్‌తో బీపీసీఎల్‌ జట్టు

ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), లాటిన్‌ అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు బ్రెజిల్‌కు చెందిన జాతీయ చమురు సంస్థ పెట్రోబ్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శనివారం వెల్లడించింది.

Published : 25 Sep 2022 02:17 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), లాటిన్‌ అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు బ్రెజిల్‌కు చెందిన జాతీయ చమురు సంస్థ పెట్రోబ్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శనివారం వెల్లడించింది. కంపెనీ అవసరాలకు తగ్గట్లు వివిధ దేశాల నుంచి ముడి చమురు దిగుమతుల్ని వైవిధ్యీకరించే ప్రణాళికలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. పెద్ద పరిమాణంలో దిగుమతి చేసుకున్న ముడి చమురును పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనంగా మారుస్తోంది. ముంబయి (మహారాష్ట్ర), బినా (మధ్యప్రదేశ్‌), కోచి (కేరళ)లో ఉన్న 3 చమురు రిఫైనరీ యూనిట్లలో చమురును శుద్ధి చేస్తోంది.

పశ్చిమాసియా దేశాలైన ఇరాక్‌, సౌదీ అరేబియాల నుంచే అధిక భాగం ముడి చమురు ఇప్పటి వరకు బీపీసీఎల్‌కు సరఫరా అవుతోంది. ఇతర దేశాల నుంచీ చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా పోర్ట్‌ఫోలియోను వైవిధ్యీకరించినట్లు అవుతుందని, ఏ దేశమైనా సరఫరా తగ్గించినా ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చని బీపీసీఎల్‌ వెల్లడించింది. అవగాహనా ఒప్పంద (ఎంఓయూ) పత్రాలపై సీఎండీ అరుణ్‌ కుమార్‌ సింగ్‌తోపాటు పెట్రోబ్రాస్‌ సీఈఓ కయో పేస్‌ డి ఆండ్రేడ్‌ సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని