ఆ ఫారంలో రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి

రవీంద్ర మేట్కర్‌.. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ రైతు పౌల్ట్రీ రంగంలో చరిత్ర సృష్టిస్తున్నారు. అమరావతి జిల్లాలోని అంజన్‌గావ్‌ బారీ గ్రామానికి చెందిన రవీంద్ర రోజూ రికార్డు స్థాయిలో లక్షా 20 వేల కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు.

Published : 09 Oct 2022 01:56 IST

50 మంది సిబ్బందితోనే సాధ్యం చేసిన రైతు

ఈటీవీ భారత్‌, అమరావతి (మహారాష్ట్ర): రవీంద్ర మేట్కర్‌.. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ రైతు పౌల్ట్రీ రంగంలో చరిత్ర సృష్టిస్తున్నారు. అమరావతి జిల్లాలోని అంజన్‌గావ్‌ బారీ గ్రామానికి చెందిన రవీంద్ర రోజూ రికార్డు స్థాయిలో లక్షా 20 వేల కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. విదర్భ ప్రాంతంలో చుట్టుపక్కల మరెక్కడా ఈ స్థాయి ఉత్పత్తి లేదు. ‘మాతోశ్రీ పౌల్ట్రీ ఫారం’ పేరిట ఈయన ప్రారంభించిన వ్యాపారానికి జాతీయస్థాయి గుర్తింపు సైతం లభించింది. ఈ పౌల్ట్రీ ఫారంలో అన్నీ ఆటోమేటిక్‌ వ్యవస్థలతో కూడిన అత్యాధునిక వసతులే. వేల సంఖ్యలో ఉన్న కోళ్లకు మేత వేయడం, వాటి విసర్జితాలు తొలగించడం, పెట్టిన గుడ్లు సేకరించడం.. ఇలా అన్ని పనులు యంత్రాలే చేస్తాయి. ఉష్ణోగ్రత పరంగా కోళ్లు ఇబ్బంది పడకుండా ఏసీ వసతి కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా అపరిశుభ్రతకు చోటనేది లేదు. ఈ వసతులతో కోళ్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగినట్లు రవీంద్ర మేట్కర్‌ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. ‘మాకు మార్కెటింగు సమస్య కూడా లేదు. కోడిగుడ్లన్నీ పౌల్ట్రీ ఫారం వద్దే అమ్మేస్తాం. భోపాల్‌, ఖాండ్వా, బెర్హాన్‌పుర్‌, ఇందోర్‌ వంటి నగరాలకు వీటిని తరలిస్తారు. గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి కూడా పంపుతుంటాం’ అని వివరించారు. ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణకు నిపుణులైన 50 మంది సిబ్బంది మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. కోళ్లకు రోజూ 13 టన్నుల ఆహారం అందిస్తారు. అన్నీ కలిపి రోజుకు రూ.3.5 లక్షల ఖర్చు ఉంటుంది. రవీంద్ర కృషికి గుర్తింపుగా పలు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి అందించే ప్రతిష్ఠాత్మక జగ్జీవన్‌ రాం అభినవ్‌ కిసాన్‌ అవార్డు, జగ్జీవన్‌ రాం ఇన్నొవేటివ్‌ ఫార్మర్‌ అవార్డు-2021 వంటివి ఇందులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని