IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలులో ‘పెద్దోళ్ల’కు అనుమతి లేదు!
‘ఐడీబీఐ బ్యాంక్లో 61 శాతం వాటా కొనుగోలుకు బిడ్ వేసే కన్సార్షియంలో మైనారిటీ వాటాదారుగా కూడా ఉండడానికి పెద్ద కార్పొరేట్లకు అనుమతి లేదు.
దిల్లీ: ‘ఐడీబీఐ బ్యాంక్లో 61 శాతం వాటా కొనుగోలుకు బిడ్ వేసే కన్సార్షియంలో మైనారిటీ వాటాదారుగా కూడా ఉండడానికి పెద్ద కార్పొరేట్లకు అనుమతి లేదు. ప్రస్తుత ఆర్బీఐ నిబంధనలు బ్యాంకు ప్రమోటర్లుగా పారిశ్రామిక కంపెనీలు మారడానికి ఒప్పుకోవ’ని ఒక అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో పారిశ్రామిక సంస్థలు గరిష్ఠంగా 10 శాతం వాటాను కలిగి ఉండడానికి అనుమతి ఉంది. అయితే అవి ప్రమోటరుగా ఉండలేవు. ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వం 60.72 శాతం వాటా విక్రయానికి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఇటీవల ఆహ్వానించింది. అయితే ఈ వ్యూహాత్మక విక్రయంలో పెద్ద కార్పొరేట్లపై నిషేధం ఉంది. బిడ్ పత్రాల ప్రకారం.. పెద్ద పరిశ్రమ/కార్పొరేట్ సంస్థ అంటే రూ.5,000 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండి; గ్రూప్ స్థూల ఆదాయం/ఆస్తుల్లో 40 శాతం కంటే ఎక్కువ ఆర్థికేతర వ్యాపారాన్ని కలిగి ఉండాలి. కాగా, ఆసక్తి వ్యక్తీకరించిన బిడ్డరు పెద్ద కంపెనీకి చెందినవారా లేదా పెద్ద సంస్థతో అనుబంధం ఉన్నవారా అన్నదానిపై ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఐడీబీఐ బ్యాంక్ కోసం ఈఓఐ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 16 అన్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ వ్యూహాత్మక విక్రయం పూర్తి కావొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.