అత్యుత్తమ యాజమాన్యం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ పరంగా దేశంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉంది.

Updated : 07 Nov 2022 07:58 IST

ప్రపంచంలో 20వ స్థానం: ఫోర్బ్స్‌

దిల్లీ: భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ పరంగా దేశంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉంది. ఫోర్బ్స్‌ వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ ర్యాంకింగ్స్‌ 2022 ప్రకారం.. దేశయంగా తొలిస్థానంలో ఉన్న రిలయన్స్‌, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. ఒక భారత సంస్థకు ఇదే అత్యుత్తమ ర్యాంకు. 800 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితా అగ్రస్థానంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ నిలిచింది. తర్వాతి స్థానాలను అమెరికా సంస్థలు మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), యాపిల్‌ దక్కించుకున్నాయి. అమెరికా కంపెనీలే రెండు నుంచి పన్నెండు స్థానాలను పొందాయి. జర్మనీ వాహన దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్‌ 13వ స్థానంలో ఉంది. ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 14, ఫ్రాన్స్‌ సంస్థ డెకాథ్లాన్‌ 15వ స్థానాల్లో నిలిచాయి.

* జర్మనీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌, అమెరికా పానీయాల సంస్థ కోక-కోలా, జపాన్‌ వాహన దిగ్గజాలు, హోండా, యమహా, సౌదీ చమురు సంస్థ అరామ్‌కో వంటి సంస్థల కన్నా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మెరుగైన స్థానం పొందింది.

* ఈ జాబితాలో మన దేశం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (137వ స్థానం), బజాజ్‌ (173), ఆదిత్య బిర్లా గ్రూప్‌ (240), హీరో మోటోకార్ప్‌ (333), ఎల్‌ అండ్‌ టీ (354), ఐసీఐసీఐ బ్యాంక్‌ (365), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (455), ఎస్‌బీఐ (499), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (547), ఇన్ఫోసిస్‌ (668) ఉన్నాయి.

* ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేసే గ్రేట్‌ రిజిగ్నేషన్‌ కొనసాగగా, కొవిడ్‌-19 పరిణామాలు కార్యాలయాల పనితీరును మార్చేశాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, అవకాశాలు, పని-జీవన సమతౌల్యతకు ఉద్యోగులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది.

* 57 దేశాల నుంచి 1,50,000 మంది పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

రిలయన్స్‌కే మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ

జర్మనీ సంస్థ మెట్రో ఏజీ, మన దేశంలో నిర్వహిస్తున్న మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 500 మిలియన్‌ యూరోల (సుమారు రూ.4060 కోట్ల)కు కొనుగోలు చేయనుంది. దేశంలో 31 టోకు వ్యాపార కేంద్రాలను మెట్రో నిర్వహిస్తోంది. వీటితో పాటు ఆయా కేంద్రాలకు ఉన్న భూమి, ఇతర ఆస్తులు కూడా రిలయన్స్‌కే చెందుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యాపార సంస్థలకూ ప్రత్యేక లావాదేవీలు నిర్వహించాలని భావిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌కు ఇది కలిసి రానుంది. కొన్ని నెలలుగా ఇరు సంస్థల మధ్య జరుగుతున్న సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని, రిలయన్స్‌ ఆఫర్‌కు మెట్రో అంగీకరించిందని చెబుతున్నారు. దీనిపై ఇరు సంస్థలు అధికారికంగా స్పందించలేదు. మెట్రోకు కిరాణా దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరర్లు, కార్పొరేట్‌ సంస్థలు, ఎంఎంఈలు, కంపెనీలు ఖాతాదార్లుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని