మస్క్‌ సంపద రోజుకు రూ.2,500 కోట్లు ఆవిరి

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ సగటున రోజుకు రూ.2,500 కోట్ల మేర ఆవిరవుతోంది.

Updated : 23 Nov 2022 04:17 IST

బ్లూమ్‌బెర్గ్‌ సంపద సూచీలో అధికంగా కోల్పోతోంది ఈయనే

ఏడాది ప్రారంభం నుంచి ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ సగటున రోజుకు రూ.2,500 కోట్ల మేర ఆవిరవుతోంది. బ్లూమ్‌బెర్గ్‌ వెల్త్‌ ఇండెక్స్‌ (సంపద సూచీ) జాబితాలోని ఇతర కుబేరుల కంటే మస్క్‌ సంపదే అధికంగా హరించుకుపోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన ట్విటర్‌కు సంబంధించిన సమస్యలు ఆయన్ను వేధిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వారి జాబితాలో మస్క్‌దే ఇప్పటికీ అగ్రస్థానం. రెండేళ్లుగా ఆయన విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా షేరు విలువ తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు మస్క్‌ సంపద విలువ 101 బిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. ఒక దశలో ఆయన సంపద విలువ 340 బి.డాలర్ల గరిష్ఠస్థాయికి చేరింది. అంటే ఇప్పటికి దాదాపు సగం మేర ఆవిరైంది. న్యూయార్క్‌లో షేర్ల ట్రేడింగ్‌ పూర్తయిన తర్వాత ప్రతి రోజు బ్లూమ్‌బర్గ్‌ వెల్త్‌ ఇండెక్స్‌ గణాంకాలను సవరిస్తుంటుంది.

రెండేళ్ల కనిష్ఠానికి టెస్లా షేరు

లైట్ల సమస్య కారణంగా అమెరికాలో 3,21,000 టెస్లా కార్లను వెనక్కి పిలిపించడం, ముందు సీటు ఎయిర్‌బ్యాగ్‌లో సమస్యలు సవరించేందుకు మరో 30,000 మోడల్‌ ఎక్స్‌ కార్లను రీకాల్‌ చేయడం వల్లే టెస్లా కంపెనీ షేరు 3 శాతం నష్టపోయి రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. గరిష్ఠాల నుంచి కంపెనీ షేరు భారీగా పడటంతో మార్కెట్‌ విలువ సుమారు సగం మేర కోల్పోయింది. ఈ ఏడాది మొత్తం కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.

2022 ఆగస్టు నాటికి టెస్లాలో 15 శాతం వాటా మస్క్‌ చేతిలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్విటర్‌ను 44 బి.డాలర్లతో కొనుగోలు చేసేందుకు ఆయన ఆఫర్‌ ప్రకటించిన సంగతి విదితమే. ఎన్నో ఒడుదొడుకుల మధ్య గత నెలలో ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ చేతికి రాగానే ఉద్యోగాల కోతకు దిగారు. మొత్తం 7,000 మంది ఉద్యోగుల్లో సగం మందికి పైగా తొలగించారు. తాజా విడత లేఆఫ్‌లతో కలిపి ట్విటర్‌లో 60 శాతం ఉద్యోగులకు ఆయన ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని