మొబైల్‌.. కంప్యూటర్‌.. బ్యాంకింగ్‌.. అన్నింటిలోనూ ఉద్యోగ కోతలే

మొబైల్‌ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, చైనా మొబైల్‌ కంపెనీలు దేశీయంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి.

Updated : 24 Nov 2022 08:15 IST

వచ్చే ఏడాదికి వ్యయ నియంత్రణపై చైనా కంపెనీల దృష్టి 

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగ కోతలు ప్రారంభించగా, మొబైల్‌ - కంప్యూటర్‌ తయారీ  సంస్థలు, బ్యాంకింగ్‌ దిగ్గజమూ ఇదే బాట పడుతున్నట్లు ప్రకటించాయి.

మొబైల్‌ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, చైనా మొబైల్‌ కంపెనీలు దేశీయంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. ఇందుకోసం ఉద్యోగాల్లో కోతకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కంపెనీల నుంచి స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు ఈ ఏడాది స్తబ్దుగా నమోదు కాగా, వచ్చే ఏడాదిలోనూ అదే ధోరణి ఉంటుందనే అంచనాలున్నాయి. ‘అందుకే మార్కెటింగ్‌, పంపిణీ విభాగాల్లో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ ఇంకా నిర్ణయం తీసుకోలేద’ని మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ ఇండియా ప్రతినిధి తెలిపారు.

లాభదాయకతపై సందేహాల వల్లే: 2022 తరహాలోనే గిరాకీలో స్తబ్దత, నియంత్రణ పరమైన ఒత్తిడి కొనసాగితే లాభదాయకతపై ప్రభావం పడొచ్చని మొబైల్‌ పరిశ్రమ భావిస్తోంది. అందుకే సిబ్బందికి లే ఆఫ్‌లు, స్వచ్ఛంద పదవీ విరమణల దిశగా అవి అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. షియోమీ, ఒపో, వివో వంటి చైనా కంపెనీల కార్యకలాపాలపై ప్రభుత్వ పరిశోధనా సంస్థలు దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. అక్టోబరు-డిసెంబరుకు స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో, 2021తో పోలిస్తే 2022 మొత్తం మీద 8-9 శాతం మేర క్షీణత నమోదు కావొచ్చని ఐడీసీ ఇండియా అంచనా వేసింది.

ఇప్పటికే తొలగింపులు

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయంగా కొన్ని త్రైమాసికాల్లో పలు చైనా కంపెనీలు 600-800 మంది ఉద్యోగులను తగ్గించాయని తెలుస్తోంది. డేటా రక్షణ విధానాల్లో కఠిన ఆంక్షల నేపథ్యంలో, కొన్ని కంపెనీల నుంచి ఉద్యోగులే తప్పుకుని, వేరే కంపెనీలకు మారుతున్నారని సమాచారం. విక్రయాల విభాగాల్లో ఉన్న ఉన్నతాధికారులు తొలగడం కనిపించింది. గత ఏడాదిన్నర కాలంలో ఈ కంపెనీల సిబ్బందిలో 30% కోత విధించినట్లు చెబుతున్నారు. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే కొన్నేళ్లలో 20-30 శాతం మేర తొలగింపులుండొచ్చంటున్నారు. మార్కెట్లో అవకాశాలకు అనుగుణంగా సిబ్బంది వలసలూ పెరగవచ్చని అంచనా.


హెచ్‌పీలో 6,000 మంది ఇంటికి

ర్థిక మందగమనం నేపథ్యంలో అమెరికాలోని దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ హెచ్‌పీ కూడా 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం ఉద్యోగుల్లో 12 శాతం (సుమారు 6,000) మందికి లేఆఫ్‌ ఇస్తామని ప్రకటించింది. వ్యక్తిగత, వాణిజ్య పరమైన గిరాకీ తగ్గడం వల్ల, 2023 తొలి త్రైమాసికంలో అంచనా వేసిన దాని కంటే లాభం మరింత తగ్గే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. 2022లో ఎదురైన సవాళ్లు, 2023లోనూ కొనసాగొచ్చని సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి మేరీ మయర్స్‌ వెల్లడించారు. కంపెనీలో సుమారు 50,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్నారు. వీరిలో 4,000-6,000 మందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమవుతోంది. కొవిడ్‌ పరిణామాల్లో పీసీలు, ల్యాప్‌టాప్‌లకు ప్రజలు, సంస్థల నుంచి అధిక ఆర్డర్లు రావడంతో గరిష్ఠ విక్రయాలు నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే, ప్రస్తుతం విక్రయాలు భారీగా పడ్డాయని కంపెనీ వెల్లడించింది. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో కుటుంబాలు, వ్యాపార సంస్థలు వ్యయాలను తగ్గించుకుంటుండటమూ గిరాకీ తగ్గడానికి మరో కారణంగా భావిస్తోంది. కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ కూడా సెప్టెంబరు త్రైమాసికంలో 6 శాతం తక్కువ ఆదాయాన్ని ప్రకటించింది. ఇంటెల్‌ కూడా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెజాన్‌, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌, సిస్కో సిస్టమ్స్‌, గూగుల్‌.. ఇలా దిగ్గజ సంస్థలన్నీ ఇటీవల ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన సంగతి విదితమే.


క్రెడిట్‌ సూయిజ్‌లో 9,000

డిసెంబరు త్రైమాసికంలో 2,700 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు 2025 నాటికి మొత్తం 9,000 మందిని ఇంటికి పంపించేందుకు స్విట్జర్లాండ్‌లో రెండో అతి పెద్ద బ్యాంక్‌ అయిన క్రెడిట్‌ సూయిజ్‌ సిద్ధమైంది. సంపద నిర్వహణ సేవల ఖాతాదారుల్లో స్తబ్దత నెలకొన్నందున, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 1.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,300 కోట్లు) మేర నష్టం ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు ఆశాజనకంగా లేవని, అన్ని విభాగాల పని తీరు అంతగా బాగోలేదని క్రెడిట్‌ సూయిజ్‌ తెలిపింది. ఇదే స్థితి మరికొన్ని నెలలు కొనసాగొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని