సెన్సెక్స్‌ @ 68,500

వచ్చే ఏడాది డిసెంబరుకు సెన్సెక్స్‌ 10 శాతం దూసుకెళ్లి 68,500 పాయింట్లకు చేరే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది.

Updated : 29 Nov 2022 02:02 IST

2023 డిసెంబరుకు చేరొచ్చు
మోర్గాన్‌ స్టాన్లీ అంచనా

సమీక్ష

ముంబయి: వచ్చే ఏడాది డిసెంబరుకు సెన్సెక్స్‌ 10 శాతం దూసుకెళ్లి 68,500 పాయింట్లకు చేరే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్‌ రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నట్లు పేర్కొంది. సంస్థ ముఖ్య ఆర్థికవేత్త రిధమ్‌ దేశాయ్‌, ఆయన బృందం రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. ‘కంపెనీల లాభాదాయకత పెరుగుతోంది. 2023 మొదటి త్రైమాసికంలో వడ్డీ రేట్లు గరిష్ఠానికి చేరొచ్చు. 2022తో పోలిస్తే అంతర్జాతీయ ప్రతికూలతలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో భారత ఈక్విటీలు పరుగులు తీయొచ్చు. 2023లో కొంత జోరు తగ్గడానికి కూడా అవకాశం ఉంది’ అని నివేదిక పేర్కొంది.

* గత రెండేళ్లలో ప్రభుత్వ విధానాలు, దేశీయంగా పెట్టుబడులు పెరగడం, జీడీపీలో కార్పొరేట్‌ లాభాల వాటా అధికం కావడం, ఎఫ్‌డీఐ పెట్టుబడులు, అమెరికా వృద్ధి, చమురు ధరలకు ధీటుగా నిలవడం వంటి మార్కెట్‌ జోరుకు కారణమయ్యాయి.
* ప్రపంచ వృద్ధి బలహీనంగా ఉండటంతో వర్థమాన దేశాల మార్కెట్లు లబ్ధి పొందే అవకాశం ఉంది. అధిక విలువల కారణంగా 2023 ప్రథమార్థంలో మార్కెట్‌ జోరుకు విరామం రావొచ్చు.
కొనసాగిన రికార్డుల జోరు
మదుపర్ల కొనుగోళ్ల జోరుతో సూచీలు తాజా జీవనకాల గరిష్ఠాలను అధిరోహించాయి. ముడిచమురు ధరలు తగ్గడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పరుగులు తీయడం కలిసొచ్చింది. సెన్సెక్స్‌ చివరకు 211.16 పాయింట్ల లాభంతో 62,504.80 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 50 పాయింట్లు పెరిగి 18,562.75 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 81.68 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 3.11 శాతం నష్టపోయి 81.03 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  
* బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రికార్డు గరిష్ఠమైన 285.89 లక్షల కోట్లుగా నమోదైంది.
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 లాభాలు నమోదు చేశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3.48%, నెస్లే 1.50%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.44%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.22%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.83%, విప్రో 0.76%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.72% రాణించాయి.  
* ధర్మాజ్‌ క్రాప్‌ గార్డ్‌ ఐపీఓ మొదటి రోజున 1.79 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 80,12,990 షేర్లు జారీ చేయగా.. 1,43,79,060 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
* బీఎస్‌ఈలో లిక్విడిటీ లేని స్టాక్‌ ఆప్షన్స్‌ కేసుల్లో చర్యలు ఎదుర్కొంటున్న స్టాక్‌ బ్రోకర్ల కోసం సెబీ కొత్త సెటిల్‌మెంట్‌ పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం డిసెంబరు 19న ప్రారంభమై.. 2023 జనవరి 19న ముగియనుంది.
* థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం చికిత్సలో వినియోగించే జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ లెవోథైరాక్సిన్‌ సోడియం ఇంజెక్షన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది.
* ఆయుర్వేద, హెర్బల్‌ ఉత్పత్తులను విక్రయించే ఉపకర్మ ఆయుర్వేదలో మెజారిటీ వాటాను బయటకు వెల్లడించని మొత్తానికి మ్యాన్‌కైండ్‌ ఫార్మా కొనుగోలు చేసింది.
* రూ.1,000 కోట్ల వరకు సమీకరించే నిమిత్తం స్థిరాస్తి సంస్థ సిగ్నేచర్‌ గ్లోబల్‌(ఇండియా) ప్రతిపాదించిన పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు సెబీ అనుమతులు ఇచ్చింది.
* ప్రాపర్టీ టెక్‌ అకుంరం హోమ్స్‌ఫై రియాల్టీ.. పబ్లిక్‌ ఇష్యూ వచ్చేందు కోసం ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని