ఫోన్‌ చేసిన వారి పేరు కనిపిస్తుంది!

మనం ఫోన్‌లో స్టోర్‌ చేసుకున్న వారి పేర్లు, వారు కాల్‌ చేసినప్పుడు సెల్‌ఫోన్‌ తెరపై కనిపిస్తున్నాయి.

Published : 30 Nov 2022 02:18 IST

వ్యవస్థను తీసుకురానున్న ట్రాయ్‌
మోసపూరిత కాల్స్‌ నివారణకే
చర్చాపత్రం విడుదల

దిల్లీ: మనం ఫోన్‌లో స్టోర్‌ చేసుకున్న వారి పేర్లు, వారు కాల్‌ చేసినప్పుడు సెల్‌ఫోన్‌ తెరపై కనిపిస్తున్నాయి. అయితే తెలియని వారు ఫోన్‌ చేసినా, కూడా వారి పేరు కనిపించేలా.. ప్రస్తుతం ‘ట్రూకాలర్‌’, ‘భారత్‌ కాలర్‌ ఐడీ అండ్‌ యాంటీ స్పామ్‌’ వంటి యాప్‌లు సేవలు అందిస్తున్నాయి.  ఆయా యాప్‌లు వినియోగించే వారి వద్ద ఉన్న డేటా (క్రౌడ్‌ సోర్సింగ్‌) ఆధారంగా అందించే ఈ సేవలు అంత విశ్వసనీయంగా ఉండకపోవచ్చు. అందుకే టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ రంగంలోకి దిగింది. మోసపూరిత కాల్స్‌ నిరోధించే నిమిత్తం.. కాల్‌ చేసిన వ్యక్తి పేరు మొబైల్‌ తెరపై కనిపించే వ్యవస్థను తీసుకురానుంది. ఇందు కోసం ‘ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ (సీఎన్‌ఏపీ) ఇన్‌ టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్స్‌’ పేరిట చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ‘సీఎన్‌ఏపీ వల్ల వినియోగదార్లు తమకు వచ్చిన కాల్‌ మాట్లాడాలా, వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోగలుగుతారని.. ఆ దిశగా టెలికాం నెట్‌వర్క్‌లను సిద్ధం చేయాలని టెలికాం విభాగం(డాట్‌) సూచించింద’ని ట్రాయ్‌ పేర్కొంది. ఈ చర్చాపత్రంపై డిసెంబరు 27లోపు ప్రజలు స్పందించవచ్చు. 2023 జనవరి 10లోగా అందుకు ప్రతిస్పందనలను తెలియజేస్తారు. సీఎన్‌ఏపీ సేవలను అందించాలంటే సర్వీసు ప్రొవైడర్లకు వినియోగదార్ల వాస్తవ పేర్లతో కూడిన డేటాబేస్‌ యాక్సెస్‌ అందించాల్సి ఉంటుంది. ఈ సేవలందించడానికి వివిధ వ్యాపార నమూనాలను అన్వేషిస్తున్నట్లు చర్చాపత్రంలో ట్రాయ్‌ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని