1 నుంచి రిటైల్‌ డిజిటల్‌ రూపాయి

రిటైల్‌ డిజిటల్‌ రూపాయి(ఇRs-ఆర్‌) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ప్రకటించింది.

Published : 30 Nov 2022 02:30 IST

ఆర్‌బీఐ ప్రయోగాత్మక ప్రాజెక్టు
నాలుగు బ్యాంకులకు అనుమతులు
తొలుత దిల్లీ, ముంబయి, బెంగళూరు, భువనేశ్వర్‌లలో
తదుపరి హైదరాబాద్‌ సహా 9 నగరాలకు

ముంబయి: రిటైల్‌ డిజిటల్‌ రూపాయి(ఇRs-ఆర్‌) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ప్రకటించింది. తొలుత 4 నగరాల్లో ప్రారంభించి, తదుపరి మరో 9 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తారు. ప్రస్తుతానికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు ఈ లావాదేవీల్లో పాల్గొంటాయి. డిజిటల్‌ రూపాయిని టోకు విభాగంలో నవంబరు 1న ఆర్‌బీఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) లేదా డిజిటల్‌ రూపాయి అనేది డిజిటల్‌ రూపంలో ఆర్‌బీఐ జారీ చేసే అధీకృ కరెన్సీ. వీటిని బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. ‘ఇRs-ఆర్‌ అనేది డిజిటల్‌ టోకెన్‌ రూపంలో ఉంటుంది. చట్టబద్ధంగా ఇది చెల్లుతుంది. ప్రస్తుతం జారీ అవుతున్న పేపరు కరెన్సీ, నాణేల విలువల (డినామినేషన్స్‌)లోనే ఇది కూడా జారీ అవుతుంద’ని ఆర్‌బీఐ పేర్కొంది.

* టోకు డిజిటల్‌ రూపాయి తరహాలోనే రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ఎంపిక చేసిన వినియోగదార్లు, వ్యాపారులతో కూడిన బృందాల (సీయూజీ)కు మాత్రమే అందుబాటులోకి తెస్తారు.
* బ్యాంకుల ద్వారా జారీ అయ్యే డిజిటల్‌ రూపాయి(రిటైల్‌)ని.. బ్యాంకులు అందించే డిజిటల్‌ వాలెట్‌ రూపంలో మొబైల్‌ ఫోన్లు/ఇతర పరికరాల్లో దాచుకోవచ్చు.
* వీటి సాయంతో వ్యక్తి నుంచి వ్యక్తి(పీ2పీ)కి; వ్యక్తి నుంచి వ్యాపారులకు(పీ2ఎమ్‌) లావాదేవీలు జరపొచ్చు. మర్చంట్ల వద్ద ఉండే క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగించి వారికి చెల్లింపులు చేయవచ్చు.
* భౌతిక నగదు తరహాలోనే ఇRs-ఆర్‌ సైతం భద్రత, సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. ఈ రూపంలో నగదు మన వాలెట్లలో ఉంటే వడ్డీ లభించదు. కేవలం బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంచితేనే వడ్డీ లభిస్తుంది.
* ప్రాథమికంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌.. నగరాల్లో ఈ ప్రయోగాత్మక లావాదేవీలు అమలవుతాయి. తదుపరి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, సిమ్లా, ఇండోర్‌, కోచి, గాంగ్‌టక్‌, లఖ్‌నవూ, గువహటి వంటి 9 నగరాలకు విస్తరిస్తారు.
* క్రమంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లకు; ఇతర వినియోగదార్లు, ప్రాంతాలకు కూడా డిజిటల్‌ రూపీ సేవలను విస్తరిస్తారు.
* ఇRs-ఆర్‌ టోకెన్‌కు సంబంధించిన వివిధ ఫీచర్లు, ఉపయోగాలను భవిష్యత్తు ప్రయోగాత్మక ప్రాజెక్టుల్లో పరీక్షిస్తారు.

* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కేంద్ర బ్యాంకులు సీబీడీసీలపై ఆసక్తి వ్యక్తం చేశాయి. కొన్ని ఇప్పటికే రిటైల్‌, టోకు విభాగాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెడితే.. చాలా వరకు పరిశోధన, పరీక్షలు, సొంత సీబీడీసీ వ్యవస్థలపై పనిచేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని