4 విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటా విక్రయం వాయిదా

హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ప్రైవేట్‌ సంయుక్త సంస్థల్లో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కు ఉన్న వాటాను విక్రయించే ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 01 Dec 2022 01:36 IST

విలువ తక్కువగా ఉండటం వల్లే

దిల్లీ: హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ప్రైవేట్‌ సంయుక్త సంస్థల్లో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కు ఉన్న వాటాను విక్రయించే ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ (ఎన్‌ఎంపీ) కార్యక్రమం కింద ఈ 4 విమానాశ్రయాల్లో ఏఏఐకు మిగిలిన వాటాను విక్రయిస్తామని 2021 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించింది. 2021-22 నుంచి 2024-25 మధ్య విక్రయించే కీలక ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.6 లక్షల కోట్లు వస్తాయని అంచనా. దిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో ఏఏఐకు 26 శాతం చొప్పున, హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాల్లో 13 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాటాల విలువ తక్కువగా ఉన్నందున.. వీటి విక్రయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ పరిణామాలపై పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగా(దీపమ్‌)న్ని సంప్రదించగా.. ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్‌ఎంపీ కింద 25 విమానాశ్రయాలు, పై నాలుగు నగరాల్లోని విమానాశ్రయాల్లో ఏఏఐకు ఉన్న మిగిలిన వాటాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2022-25 కాలానికి ఈ ఆస్తుల మొత్తం విలువను రూ.20,782 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని