8 రోజుల్లో రూ.9 లక్షల కోట్ల లాభం

వరుసగా ఎనిమిదో రోజూ సూచీల రికార్డుల పరుగు కొనసాగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు తోడవ్వడంతో నిఫ్టీ 18,800 పాయింట్ల ఎగువన ముగిసింది.

Published : 02 Dec 2022 04:25 IST

18,800 ఎగువకు నిఫ్టీ
సమీక్ష

వరుసగా ఎనిమిదో రోజూ సూచీల రికార్డుల పరుగు కొనసాగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు తోడవ్వడంతో నిఫ్టీ 18,800 పాయింట్ల ఎగువన ముగిసింది. నవంబరులో తయారీ పీఎంఐ 55.7 పాయింట్లకు చేరడం, ఐటీ షేర్లు రాణించడమూ కలిసొచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 81.26 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.40 శాతం పెరిగి 87.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభపడగా, ఐరోపా సూచీలు పరుగులు తీశాయి.

* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.289.88 లక్షల కోట్లకు చేరింది. గత 8 ట్రేడింగ్‌ రోజుల్లో సెన్సెక్స్‌ 2139.35 పాయింట్లు దూసుకెళ్లగా, మదుపర్ల సంపద రూ.8.96 లక్షల కోట్లు పెరిగింది.

* సెన్సెక్స్‌ ఉదయం 63,357.99 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,583.07 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం లాభాల స్వీకరణ ఎదుర్కొంది. చివరకు 184.54 పాయింట్ల లాభంతో 63,284.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,887.60 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసి, చివరకు 54.15 పాయింట్లు పెరిగి 18,812.50 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 మెరిశాయి. అల్ట్రాటెక్‌ 2.86%, టాటా స్టీల్‌ 2.79%, టీసీఎస్‌ 2.44%, టెక్‌ మహీంద్రా 2.27%, విప్రో       1.63%, ఇన్ఫోసిస్‌ 1.54%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.37%, ఎల్‌ అండ్‌ టీ 1.27%, ఎస్‌బీఐ 0.92% రాణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.41%, ఎం అండ్‌ ఎం      1.06%, పవర్‌గ్రిడ్‌ 0.94%, హెచ్‌యూఎల్‌ 0.65% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. ఐటీ 2.03%, స్థిరాస్తి 1.94%, టెక్‌ 1.58%, కమొడిటీస్‌ 1.24%, పరిశ్రమలు 0.74% పెరిగాయి. విద్యుత్‌, చమురు-గ్యాస్‌, ఇంధన, ఎఫ్‌ఎమ్‌సీజీ పడ్డాయి. బీఎస్‌ఈలో 2033 షేర్లు లాభాల్లో ముగియగా, 1463 స్క్రిప్‌లు నష్టపోయాయి. 140 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* యాక్సిస్‌-సిటీ లావాదేవీ మరింత ఆలస్యం: సిటీ ఇండియా వినియోగదారు కార్యకలాపాల వ్యాపారం కొనుగోలు లావాదేవీ మరింత ఆలస్యం కావొచ్చని, 2023 మే నెలకు పూర్తి కావొచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అమితాబ్‌ ఛౌద్రీ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 30న సిటీ బ్యాంక్‌ వినియోగదారు కార్యకలాపాలను రూ.12,300 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

* గుజరాత్‌ హజీరాలోని ఆర్సెలార్‌మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ (ఏఎంఎన్‌ఎస్‌) విస్తరణ ప్రాజెక్ట్‌కు 1800 టన్నుల స్ట్రక్చరల్‌ ఉక్కును ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ ఉక్కు) సరఫరా చేసింది.

* యెస్‌ బ్యాంక్‌లో 9.99 శాతం వాటా కొనుగోలుకు ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజ సంస్థలు కార్లైల్‌ గ్రూప్‌, అడ్వెంట్‌లకు ఆర్‌బీఐ అనుమతి లభించింది. ఈ ఏడాది జులైలో యెస్‌ బ్యాంక్‌లో రూ.8000 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ సంస్థలు ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని