ఔషధ, వైద్య సేవల కంపెనీలదే అగ్రస్థానం

‘బర్గండీ ప్రైవేట్‌ హురున్‌ ఇండియా 500’ కంపెనీల జాబితాలో తెలంగాణ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న 31 కంపెనీలకు స్థానం లభించింది.

Published : 02 Dec 2022 03:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘బర్గండీ ప్రైవేట్‌ హురున్‌ ఇండియా 500’ కంపెనీల జాబితాలో తెలంగాణ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న 31 కంపెనీలకు స్థానం లభించింది. ఈ కంపెనీల సంస్థాగత విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సగం వరకు ఔషధ, వైద్య సేవల రంగాల కంపెనీలే ఉన్నాయి. అత్యంత విలువైన కంపెనీగా దివీస్‌ లేబొరేటరీస్‌ ఈ జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా ఉన్నాయి. అంకుర సంస్థ అయిన ‘డార్విన్‌బాక్స్‌’, దాదాపు రూ.8,300 కోట్ల విలువతో ఈ జాబితాలో చేరడం ఒక ప్రత్యేకత.

* స్టాక్‌మార్కెట్లో నమోదు కాని (అన్‌- లిస్టెడ్‌) కంపెనీలైన హెటిరో ల్యాబ్స్‌,  మేఘా ఇంజినీరింగ్‌, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌, దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌. అరాజెన్‌ లైఫ్‌సైన్సెస్‌, బయొలాజికల్‌ ఇ.లిమిటెడ్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్‌, మేథా సర్వో డ్రైవ్స్‌.. తదితర సంస్థలు సైతం ఈ జాబితాలో స్థానం సంపాదించాయి.* ఐటీ రంగానికి చెందిన తన్లా ప్లాట్‌ఫామ్స్‌, సైయెంట్‌ లిమిటెడ్‌, వైద్య సేవల రంగంలోని కిమ్స్‌ హాస్పిటల్స్‌, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌లకూ ఇందులో స్థానం లభించింది.* తెలంగాణ నుంచి ఈ జాబితాలో ఉన్న కంపెనీల వార్షిక అమ్మకాల ఆదాయం రూ.1.8 లక్షల కోట్లకు పైగా ఉంది. దాదాపు 2.2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దాదాపు 30 ఏళ్లుగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు ఇందులో ఉన్నాయి. * ‘టాప్‌-10 యువ కంపెనీల’ జాబితాలో తెలంగాణకు చెందిన ‘మెన్సా బ్రాండ్స్‌’ అనే సంస్థకు స్థానం దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని