ఎయిర్‌బస్‌ నుంచి హైడ్రోజన్‌ ఇంజిన్‌

ఐరోపా విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ ‘హైడ్రోజన్‌ ఆధారిత ఫ్యూయల్‌ సెల్‌ ఇంజిన్‌’ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.

Published : 05 Dec 2022 04:31 IST

2035 కల్లా ఉద్గారాలు వెదజల్లని విమానం

టూలూజ్‌(ఫ్రాన్స్‌): ఐరోపా విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ ‘హైడ్రోజన్‌ ఆధారిత ఫ్యూయల్‌ సెల్‌ ఇంజిన్‌’ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్గారాలు వెదజల్లని విమానం (జీరో ఇ) కోసం దీనిని వినియోగిస్తామని ప్రకటించింది. 2035 కల్లా ఈ విమానాన్ని సేవల్లోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌బస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(జీరో ఎమిషన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) గ్లెన్‌ లెవెల్లిన్‌ పేర్కొన్నారు. ఆ దశాబ్దం మధ్య కల్లా ‘జీరోఇ’ నమూనా విమానంపై ఈ ఫ్యూయల్‌ సెల్‌ ఇంజిన్‌కు సంబంధించిన గ్రౌండ్‌, ఫ్లైట్‌ పరీక్షలను మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. ద్రవీకృత హైడ్రోజన్‌ ట్యాంకులు, సంబంధిత సామగ్రిని మోసేలా ప్రస్తుత ఎ380 ఎమ్‌ఎస్‌ఎన్‌001 విమానానికి మార్పులు చేశారు. గ్లెన్‌ మాట్లాడుతూ ‘సాంకేతికత లక్ష్యాలను మేం చేరితే.. ఫ్యూయల్‌ సెల్‌ ఇంజిన్‌ ద్వారా 1000 మంది ప్రయాణికులతో 1000 నాటికల్‌ మైళ్ల వరకు విమానాన్ని నడపొచ్చ’ని తెలిపారు.
హరిత హైడ్రోజన్‌ కోసం భారత్‌ వైపు చూపు: ఈ విమానాలకు అవసరమైన హరిత హైడ్రోజన్‌ సేకరించడానికి భారత్‌, ఆస్ట్రేలియా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల వైపు చూస్తున్నట్లు ఎయిర్‌బస్‌ తెలిపింది. ఈ దేశాల్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉందని, ఇవి తమకు ఆకర్షణీయంగా ఉన్నట్లు గ్లెన్‌ లెవెల్లిన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని