దాతృత్వ హీరోలు అదానీ, నాడార్‌, అశోక్‌

ఆసియాలో దాతృత్వంలో ముందున్న వారిలో భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈయనతో పాటు శివ్‌ నాడార్‌, అశోక్‌ సూతా, మలేషియన్‌-ఇండియన్‌ వ్యాపారవేత్త బ్రహ్మల్‌ వాసుదేవన్‌, ఆయన భార్య శాంతి కండియాలు సైతం ‘ఫోర్బ్స్‌ ఆసియాస్‌ హీరోస్‌ ఆఫ్‌ ఫిలాంత్రపీ’లో చోటు దక్కించుకున్నారు.

Published : 07 Dec 2022 04:03 IST

సింగపూర్‌: ఆసియాలో దాతృత్వంలో ముందున్న వారిలో భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈయనతో పాటు శివ్‌ నాడార్‌, అశోక్‌ సూతా, మలేషియన్‌-ఇండియన్‌ వ్యాపారవేత్త బ్రహ్మల్‌ వాసుదేవన్‌, ఆయన భార్య శాంతి కండియాలు సైతం ‘ఫోర్బ్స్‌ ఆసియాస్‌ హీరోస్‌ ఆఫ్‌ ఫిలాంత్రపీ’లో చోటు దక్కించుకున్నారు. మంగళవారం ఈ జాబితా 16వ ఎడిషన్‌ను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఎటువంటి ర్యాంకులూ లేని ఈ జాబితాను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో బలమైన దాతృత్వ కారణాలకు వ్యక్తిగతంగా దన్నుగా నిలబడిన దిగ్గజ వ్యక్తులతో రూపొందించినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది.

ఏటా 37 లక్షల మందికి: ఈ ఏడాది జూన్‌లో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60,000 కోట్లను దానం చేస్తున్నట్లు అదానీ ప్రకటించిన విషయాన్ని ఫోర్బ్స్‌ గుర్తు చేసింది. ఈ డబ్బును అదానీ ఫౌండేషన్‌ ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు వినియోగించనున్నారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా ఏటా దేశవ్యాప్తంగా 37 లక్షల మందికి సహాయం అందిస్తూ వస్తున్నారని తెలిపింది.

పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటు: స్వయం కృషితో కుబేర స్థాయికి చేరిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌.. దేశంలోని అగ్రగామి దాతల్లో ఒకరుగా ఉంటారు. శివ్‌నాడార్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈయన కొద్ది దశాబ్దాలుగా 100 డాలర్ల (సుమారు రూ.8100 కోట్ల) మేర విరాళాలు ఇచ్చారు. ఈ ఏడాది రూ.1,160 కోట్ల మేర ఫౌండేషన్‌కు విరాళమిచ్చారు. విద్య ద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించడం కోసం దీనిని వెచ్చిస్తారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను సైతం ఈయన ఏర్పాటు చేస్తున్నారు.

వైద్య పరిశోధనకు రూ.600 కోట్లు: సాంకేతిక దిగ్గజం, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అయిన అశోక్‌ సూతా గతేడాది ఏప్రిల్‌లో ఒక వైద్య పరిశోధనా ట్రస్టు ఏర్పాటు చేసి.. రూ.600 కోట్ల మేర ఇస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే పదేళ్లలో ఈ డబ్బును వెచ్చించనున్నారు. హ్యాప్పియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీలో మెజారిటీ వాటా కలిగిన ఆయన, దాని నుంచి సంపద పొందుతున్నారు. ఇప్పటికే స్కాన్‌ (సైంటిఫిక్‌ నాలెడ్జ్‌ ఫర్‌ ఏజింగ్‌ అండ్‌ న్యూరోలాజికల్‌ ఎయిల్‌మెంట్స్‌) పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు, గతేడాది పలు ప్రాజెక్టులకు రూ.20 కోట్ల నిధులిచ్చింది.

కాలుష్యం లేని విమానాల కోసం: మలేషియాలో స్థిరపడిన భారతీయులైన బ్రహ్మల్‌ వాసుదేవన్‌,  క్రెడార్‌ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థను స్థాపించి, సీఈఓగా ఉన్నారు. ఆయన భార్య, న్యాయవాది శాంతి కండియాతో కలిసి మలేషియా, భారత్‌లో క్రెడార్‌ ఫౌండేషన్‌ ద్వారా స్థానిక ప్రజలకు మద్దతుగా నిలబడ్డారు. మలేషియాలో ఒక బోధనాసుపత్రికి 11 మి. డాలర్లను ఇవ్వనున్నట్లు ఈ ఏడాది మేలో ప్రకటించారు. అదే నెలలో ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు 30 మి. డాలర్లను ఇచ్చారు. విమానయాన పరిశ్రమలో కాలుష్యంలేని సాంకేతికతను అభివృద్ధి చేసే ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని