సెమీ కండక్టర్ల తయారీలోకి టాటాలు

భారత్‌లో టాటా గ్రూప్‌ వచ్చే కొన్నేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. అంతర్జాతీయ చిప్‌ సరఫరా వ్యవస్థలో భారత్‌ కీలక పాత్ర పోషించే లక్ష్యంతో టాటా గ్రూప్‌ ఈ దిశగా అగుడులు వేస్తోంది.

Published : 09 Dec 2022 04:17 IST

కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడతాం
టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌
దిల్లీ

భారత్‌లో టాటా గ్రూప్‌ వచ్చే కొన్నేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. అంతర్జాతీయ చిప్‌ సరఫరా వ్యవస్థలో భారత్‌ కీలక పాత్ర పోషించే లక్ష్యంతో టాటా గ్రూప్‌ ఈ దిశగా అగుడులు వేస్తోంది. కొవిడ్‌ సృష్టించిన అవాôతరాల నుంచి చిప్‌ పరిశ్రమ ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయింది. జపాన్‌కు చెందిన నిక్కీ ఏషియా ఇంటర్వ్యూలో చంద్రశేఖరన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

త్వరలో అసెంబ్లీ టెస్టింగ్‌ వ్యాపారం: విద్యుత్‌ వాహన బ్యాటరీల వంటి వర్థమాన రంగాల్లో కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘2020లో ప్రారంభమైన టాటా ఎలక్ట్రానిక్స్‌ కింద సెమీకండక్టర్‌ అసెంబ్లీ టెస్టింగ్‌ వ్యాపారాన్ని ఏర్పాటు చేయనున్నాం. పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుత చిప్‌ తయారీ సంస్థలతో భాగస్వామ్యాలకు అవకాశం ఉంది’ అని చంద్రశేఖరన్‌ అన్నారు. గతంలో కూడా సెమీకండక్టర్ల తయారీలోకి అడుగుపెట్టేందుకు గ్రూప్‌ ఆసక్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో లక్ష కోట్ల డాలర్ల అవకాశాలు ఉన్నాయని, టాటా గ్రూప్‌ దీన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అప్‌స్ట్రీమ్‌ చిప్‌ ఫ్యాబ్రికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  చిప్‌సెట్‌లతో కూడిన సెమీకండక్టర్ల తయారీకి భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. అప్‌స్ట్రీమ్‌ సెమీకండక్టర్‌ తయారీ ప్రాసెస్‌ ప్లాంట్‌ను వాటర్‌ ఫ్యాబ్రికేషన్‌ ప్లాంట్‌గా పిలుస్తారు. డౌన్‌స్ట్రీమ్‌ అసెంబ్లీ, టెస్టింగ్‌ ప్రక్రియతో పోలిస్తే ఇది సాంకేతికంగా, ఆర్థికంగా సవాళ్లతో కూడుకున్నదని పరిశ్రమ వర్గాలు చెబుతాయి. వచ్చే అయిదేళ్లలో టాటా గ్రూప్‌ 90 బి.డాలర్లు (దాదాపు రూ.7.4 లక్షల కోట్లు) పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖరన్‌ స్పష్టం చేశారు. విద్యుత్‌ వాహనాలు, విద్యుత్‌ వాహన బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి; వినియోగదారులకు సేవల నుంచి సరకులు, ఆర్థిక ఉత్పత్తుల వరకు అందించే సూపర్‌ యాప్‌ల అభివృద్ధి వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నట్లు పేర్కొన్నారు.

* కొవిడ్‌ అనంతరం కొత్త తరం వ్యాపారాలను అందిపుచ్చుకోవడానికి టాటా సన్స్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే 5జీ సేవల కోసం టెలికాం పరికరాల సంస్థ తేజస్‌ నెట్‌వర్క్స్‌లో వాటాను కొనుగోలు చేసింది.

* సూపర్‌ యాప్‌ కోసం బిగ్‌బాస్కెట్‌, 1ఎంజీ, క్యూర్‌ఫిట్‌ వంటి సంస్థలను టాటా డిజిటల్‌ దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని