ప్రైవేటు క్రిప్టోలతో సంక్షోభమే

బిట్‌ కాయిన్‌ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తే  మరో ఆర్థిక సంక్షోభం వచ్చేందుకు అవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు.

Published : 22 Dec 2022 01:50 IST

వాటిని నిషేధించాలనే చెబుతా
రుణాలు, డిపాజిట్ల మధ్య పెద్ద అంతరం లేదు
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: బిట్‌ కాయిన్‌ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తే  మరో ఆర్థిక సంక్షోభం వచ్చేందుకు అవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు. ‘ఊహాజనిత క్రిప్టో కరెన్సీల వల్ల స్థూల ఆర్థికానికి, ఆర్థిక స్థిరత్వానికి భారీ ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మేం చెబుతూనే ఉన్నామ’ని బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై  ఆయన ఏం చెప్పారంటే..  

ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం

అమెరికాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ జరిగే ఎఫ్‌టీఎక్స్‌ ఎక్స్ఛేంజీ దివాలా తీసింది. ఏడాది కాలంగా క్రిప్టో పరిణామాలు చూస్తే, ప్రమాదం పొంచి ఉందనే తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీల విలువ 190 బిలియన్‌ డాలర్ల నుంచి 140 బి.డాలర్లకు దిగివచ్చింది. ఇది 100 శాతం ఊహాజనిత కరెన్సీల ట్రేడింగ్‌. ఒక వేళ వీటిని పెంచి పోషిస్తే మాత్రం.. మరో ఆర్థిక సంక్షోభం తప్పక వస్తుంది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు అధికారిక ఆర్థిక వ్యవస్థను ‘నాశనం’ చేస్తాయి. వాటిని నిషేధించాలనే చెబుతా.

ధరలపై ప్రభుత్వంతో కలిసి పోరాడుతున్నాం

ద్రవ్యోల్బణంపై పోరులో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య ‘చాలా సమన్వయంతో కూడిన ధోరణి’ ఉంది. ధరలను అదుపులో ఉంచే విషయంలో పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. కీలక రేట్లు, పరపతి విధానం, ద్రవ్యలభ్యత రూపంలో ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంటే.. పెట్రోలు, డీజిల్‌పై పన్నులు; ఆహార వస్తువుల దిగుమతిపై సుంకాలను ప్రభుత్వం తగ్గిస్తోంది. పరపతి విధాన సమీక్షపై ఎన్నికల ప్రభావం ఉండదు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే  ప్రయత్నించొచ్చు.

రుణ వృద్ధి స్థిరంగా ఉంది

రుణ వృద్ధి మరీ ఎక్కువగా ఉందని చెప్పడానికి ఇంకా సమయం ఉంది. కొవిడ్‌ పరిణామాల వల్ల రెండేళ్ల పాటు రుణాలకు గిరాకీ బాగా తగ్గింది. అందువల్ల ఇపుడు రుణాలకు అధిక గిరాకీ ఉన్నట్లు కనిపిస్తోంది. రెండేళ్ల ప్రాతిపదిక ప్రభావం వల్లే డిపాజిట్ల వృద్ధి కూడా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి రుణ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ.. మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం. డిసెంబరు 2 నాటికి రుణ వృద్ధి రూ.19 లక్షల కోట్లకు చేరగా.. డిపాజిట్లు రూ.17.5 లక్షల కోట్లు పెరిగాయి. కాబట్టి రుణ వృద్ధి, డిపాజిట్ల పెరుగుదల మధ్య ‘మరీ ఎక్కువ అంతరం’ లేదు. వ్యవస్థలో రుణ రేట్లు 1.17 శాతం పెరగ్గా.. డిపాజిట్‌ రేట్లు   1.5 శాతం మేర పెరిగాయి.  మరో వైపు యూపీఐ వాలెట్‌తో పోలిస్తే సీబీడీసీ ప్రయోగాత్మక ప్రాజెక్టు భిన్నమైనదని.. ఇందులో ప్రత్యేక ఫీచర్లున్నాయని శక్తికాంత దాస్‌ అన్నారు.

డిజిటల్‌ కరెన్సీతో సబ్సిడీల బట్వాడా

ప్రభుత్వ సబ్సిడీలను కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)/ డిజిటల్‌ కరెన్సీ ద్వారా జారీచేసే అవకాశం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రవి శంకర్‌ ఈ సదస్సులో పేర్కొన్నారు. ‘ఇంటర్నెట్‌ పరిమిత కనెక్టివిటీ ఉన్న, నెట్‌ సిగ్నల్స్‌ లేని చోట కూడా డిజిటల్‌ రూపాయి లావాదేవీలు చేయొచ్చు. సీబీడీసీకి ఉన్న ఫీచర్ల ద్వారా ఏవైనా లక్షిత చెల్లింపులను సైతం చేయొచ్చ’ని అన్నారు. విదేశీ చెల్లింపులను వేగంగా, చౌకగా చేసే సత్తా సీబీడీసీకి ఉండడం అత్యంత ప్రధాన ప్రయోజనమన్నారు. ఒకే కార్యకలాపాలను నిర్వర్తించే పక్షంలో బ్యాంకుల తరహాలోనే ఫిన్‌టెక్‌ వంటి బ్యాంకింగేతర సంస్థలకూ నియంత్రణలు ఉండాలని పేర్కొన్నారు.

మెస్సీ కూడా చరిత్రలో పట్టభద్రులా?

చరిత్ర పాఠ్యాంశాల్లో, దిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌ నుంచి శక్తికాంత దాస్‌ పట్టభద్రులయ్యారు.  గత 28 ఏళ్లలో ఆర్‌బీఐకి ఆర్థిక అంశాలు అభ్యసించని గవర్నర్‌ ఈయనే. తరచూ ‘చరిత్ర చదివిన ఆర్‌బీఐ గవర్నర్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తుంటాయి కదా అన్న ప్రశ్నకు దాస్‌ స్పందిస్తూ ‘మెస్సీ చరిత్రలో పట్టభద్రుడై ఉంటాడా అని ఫుట్‌బాల్‌లో ఆయన ప్రత్యర్థి ఆలోచిస్తాడా? లేదు కదా.. కొన్ని సార్లు, కొంత మంది వ్యక్తులు మాత్రం నేనేం చదివానో నాకు చెబుతూ ఉంటార’ని సరదాగా దాస్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని