రిలయన్స్‌ చేతికి మెట్రో ఇండియా

దేశీయంగా తన రిటైల్‌ రంగ వ్యాపారాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరింత బలోపేతం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత టోకు వ్యాపార కార్యకలాపాలను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 23 Dec 2022 01:47 IST

విలువ రూ.2850 కోట్లు

‘ చిన్న వ్యాపారులు, కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా ఒక విశిష్ట వ్యాపార నమూనాను నిర్మించాలన్న మా సరికొత్త వాణిజ్య వ్యూహంలో భాగంగానే మెట్రో ఇండియాను కొనుగోలు చేస్తున్నాం. ఈ కంపెనీకి ఉన్న ఆస్తులు, మాకున్న కిరాణా వ్యవస్థ సహాయంతో వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించగలం.

ఈశా అంబానీ, డైరెక్టర్‌, రిలయన్స్‌ రిటైల్‌


దిల్లీ: దేశీయంగా తన రిటైల్‌ రంగ వ్యాపారాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరింత బలోపేతం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత టోకు వ్యాపార కార్యకలాపాలను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియాలో 100 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌), కచ్చితంగా అమలయ్యే వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందుకోసం రూ.2850 కోట్ల నగదు చెల్లించనుంది. తుది సర్దుబాటును అనుసరించి ఈ విలువ కాస్త మారొచ్చని ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. 2023 మార్చి కల్లా ఈ లావాదేవీ పూర్తి కావొచ్చని అంచనా.

సగం స్టోర్లు దక్షిణాదిలోనే..

మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ దేశీయ కార్యకలాపాలు 2003లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 పెద్ద ఫార్మేట్‌ స్టోర్లుంటే, ఇందులో సగం దక్షిణ భారత్‌లోనే ఉన్నాయి. మొత్తం 3,500 మంది ఉద్యోగులున్నారు. ఈ స్టోర్లలో పళ్లు, కూరగాయలు, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులు, స్టేషనరీ, మాంసం వంటివి టోకుగా విక్రయిస్తారు. ప్రభుత్వ శాఖల వద్ద నమోదైన, ధ్రువీకరణలు కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, కంపెనీలు, కిరాణా స్టోర్లు, చిన్న రిటైలర్లకే ప్రత్యేక కార్డులు ఇచ్చి, వాటి ద్వారా మాత్రమే సరకులు విక్రయిస్తున్నారు. ‘సరైన సమయంలో మా లాభదాయక టోకు వ్యాపారాన్ని విక్రయిస్తున్నాం. రిలయన్స్‌ రూపంలో మాకు తగ్గ భాగస్వామి లభించింద’ని మెట్రో ఏజీ సీఈఓ స్టీఫెన్‌ గ్రూబెల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రిలయన్స్‌కు ఏమిటి ప్రయోజనం?

దేశీయంగా రిలయన్స్‌కు 16,600కు పైగా రిటైల్‌ విక్రయశాలలు; జియో మార్ట్‌ - అజియో వంటి డిజిటల్‌ వ్యాపారాలున్నాయి. వీటికి మద్దతుగా ఒక బలమైన టోకు వ్యాపార విభాగం ఉంటే.. కార్యకలాపాలను మరింత బలంగా తీసుకెళ్లొచ్చు. మెట్రోకు దేశీయంగా 30 లక్షల మంది ఖాతాదారులున్నారు. ఇందులో 10 లక్షల మంది తరచూ కొనుగోలు చేసేవారే. కిరణా స్టోర్లతో సంబంధాలను పెంచుకోవాలన్న ఆర్‌ఐఎల్‌ లక్ష్యం ఈ కొనుగోలుతో  నెరవేరుతుందని మోర్గాన్‌ స్టాన్లీ అంటోంది. 2022 సెప్టెంబరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మెట్రో ఇండియా రూ.7,700 కోట్ల విక్రయాలను నమోదు చేసింది.

జస్ట్‌ డయల్‌, డుంజోల కొనుగోలుతో పాటు; ‘ఇండిపెండెన్స్‌’ పేరిట ఎఫ్‌ఎమ్‌సీజీ బ్రాండ్‌ను ఇటీవల రిలయన్స్‌ ఆవిష్కరించడం గమనార్హం. వీటితో ఐటీసీ, టాటా, పతంజలి, అదానీ విల్మార్‌లతో పోటీ పడుతోంది.

అంతర్జాతీయంగా ఉపయుక్తం

దేశీయ రిటైల్‌ వ్యాపారం రూ.60 లక్షల కోట్ల స్థాయిలో ఉంటే, ఇందులో నిత్యావసరాల వాటాయే 60 శాతమని అంచనా. మొత్తం రిటైల్‌లో సంఘటిత వాటా 12%. అంతర్జాతీయంగా 56వ స్థానంలో ఉన్న రిలయన్స్‌ రిటైల్‌కు సంస్థాగత ఆహార, నిత్యావసరాల వ్యాపారంలో 20% వాటా ఉంది. తాజా పరిణామంతో అంతర్జాతీయస్థాయిలో బలోపేతం కాగలదు. సమీప పోటీదారైన మోర్‌ కంటే మూడింతల స్టోర్లు రిలయన్స్‌కు ఉన్నాయి. దేశీయంగా బెస్ట్‌ప్రైస్‌ పేరిట టోకు వ్యాపారం నిర్వహిస్తున్న వాల్‌మార్ట్‌ ఇండియాను కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌నూ మరింత బలంగా ఎదుర్కోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని