మా అప్పులపై చర్చలెందుకు?

‘మా గ్రూప్‌లోని వ్యాపార విభాగాల రుణాలు తగ్గుతూ ఉన్నాయి. వేగంగా వృద్ధి చెందుతున్న మా గ్రూప్‌ను లోతుగా అర్థం చేసుకుంటే.. అప్పుల విషయంలో ఎటువంటి ఆందోళనలైనా తుడిచిపెట్టుకుపోతాయ’ని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ తెలిపారు.

Updated : 30 Dec 2022 11:43 IST

రుణాల కంటే రెండింతల లాభాలున్నాయ్‌
మా గ్రూప్‌ ఆర్థికంగా బలంగా ఉంది
గౌతమ్‌ అదానీ  

‘మా గ్రూప్‌లోని వ్యాపార విభాగాల రుణాలు తగ్గుతూ ఉన్నాయి. వేగంగా వృద్ధి చెందుతున్న మా గ్రూప్‌ను లోతుగా అర్థం చేసుకుంటే.. అప్పుల విషయంలో ఎటువంటి ఆందోళనలైనా తుడిచిపెట్టుకుపోతాయ’ని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ తెలిపారు. తమ గ్రూప్‌ అప్పులపై జరుగుతున్న చర్చలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. ‘గత తొమ్మిదేళ్లలో.. మా అప్పులతో పోలిస్తే మా లాభాలు.. రెండింతల రేటుతో వృద్ధి చెందాయి. మా గ్రూప్‌ ఆర్థికంగా చాలా బలంగా, భద్రంగా ఉంది. అప్పులు, ఎబిటా మధ్య నిష్పత్తి ఈ తొమ్మిదేళ్లలో 7.6 శాతం నుంచి 3.2 శాతానికి పరిమితమైంది. మౌలిక రంగంలో ఎక్కువ కంపెనీలు ఉన్న ఒక పెద్ద గ్రూప్‌నకు ఇవి చాలా ఆరోగ్యకర గణాంకాల’ని ఆయన వివరించారు.

* తొలి తరం పారిశ్రామికవేత్త అయిన అదానీ, 2022లో ప్రపంచంలోనే అత్యంత అధికంగా సంపదను జత చేసుకున్న వ్యక్తిగా నిలిచారు కూడా. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ గ్రూప్‌లో కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు కనిపించాయి. పోర్టులు, బొగ్గు వ్యాపారాల నుంచి హరిత ఇంధనం, విమానాశ్రయాలు, సిమెంటు, మీడియా, డేటా సెంటర్లు, లోహాలు.. ఇలా అన్ని రంగాల్లోనూ గ్రూప్‌ విస్తరించింది. అప్పులతోనే ఇంతగా వ్యాపారాలు విస్తరిస్తున్నారని కొంత మంది విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అదానీ స్పందిస్తూ ‘మా కంపెనీలు మిశ్రమ రుణాన్ని కలిగి ఉన్నాయి. భారత బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు.. మా మొత్తం అప్పుల్లో 86 శాతం నుంచి 32 శాతానికి తగ్గాయి. దాదాపు మా రుణాల్లో 50 శాతం మేర అంతర్జాతీయ బాండ్ల ద్వారా తీసుకున్నామ’ని వివరించారు.

ప్రతి 12-18 నెలలకు లక్ష కోట్ల డాలర్లు జీడీపీకి జతవుతాయ్‌: ఇతర అంశాలపై మాట్లాడుతూ ‘ఈ శతాబ్దం భారత్‌దే. వచ్చే దశాబ్దంలో ప్రతి 12-18 నెలలకు జీడీపీకి ఒక లక్ష కోట్ల డాలర్లను దేశం జత చేయగలదు. మధ్యతరగతి, యువ జనాభా భారీగా ఉండడం ఇందుకు దోహదం చేస్తుంది. హరిత హైడ్రోజన్‌ ఎగుమతిదారుగా మనదేశం మారుతుంది. అంతర్జాతీయ మాంద్యంపై ఉన్న ఆందోళనలకు సమాధానం ఇవ్వడానికి వచ్చే బడ్జెట్‌ గొప్ప అవకాశం. మూలధన వ్యయాలు, ఉపాధి, సామాజిక మౌలిక వసతులు, సామాజిక భద్రతపై దృష్టి సారిస్తే.. అంతర్జాతీయ ఇబ్బందులను భారత్‌ ఎదుర్కొంటుంది. మా ఆధీనంలోకి వచ్చిన ఎన్‌డీటీవీ సంపాదకీయం స్వతంత్రంగానే ఉంటుంది. అది ఒక విశ్వసనీయ, స్వతంత్ర అంతర్జాతీయ నెట్‌వర్క్‌గా కొనసాగుతుంద’ని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని