లక్ష్యం.. విజయం.. అదే మన గమ్యం

దేశవ్యాప్తంగా 5జీ మొబైల్‌ సేవలను 2023 చివరికల్లా విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ.. రిటైల్‌ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు.

Updated : 30 Dec 2022 07:36 IST

మెస్సి ఆదర్శంగా బృందస్ఫూర్తితో సాగాలి
జియో, రిటైల్‌తో దేశాభివృద్ధికి ఊతమివ్వాలి
పర్యావరణహిత కంపెనీగా రిలయన్స్‌  
వారసులకు ముకేశ్‌ దిశానిర్దేశం
రిలయన్స్‌ ఫ్యామిలీ డే
దిల్లీ

దేశవ్యాప్తంగా 5జీ మొబైల్‌ సేవలను 2023 చివరికల్లా విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ.. రిటైల్‌ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు. రిలయన్స్‌ గ్రూప్‌ను దేశంలోనే అత్యంత పర్యావరణహిత కంపెనీగా తీర్చిదిద్దాలని తన వారసులైన ఈశా, ఆకాశ్‌, అనంత్‌ అంబానీలకు నిర్దేశించారు. నాయకత్వం వహించడంలో, బృందస్ఫూర్తితో సాగడంలో ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సిని ఉదాహరణగా తీసుకుని.. ముందుకు నడవాలని ఉద్బోధించారు. ఆర్‌ఐఎల్‌ వ్యవస్థాపకులు, ముకేశ్‌ తండ్రి ధీరూభాయ్‌ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘రిలయన్స్‌ ఫ్యామిలీ డే’ ఈ లక్ష్య నిర్దేశానికి వేదికగా మారింది. గతేడాది ఇదే రోజున తన ముగ్గురు పిల్లలకు గ్రూప్‌లోని 3 విభాగాలను ముకేశ్‌ అప్పజెప్పిన సంగతి విదితమే. టెలికాం, డిజిటల్‌ వ్యాపారాలు ఆకాశ్‌కు; రిటైల్‌ వ్యాపారం ఈశాకు అందించగా.. కొత్త ఇంధన వ్యాపారాన్ని చిన్న కుమారుడు అనంత్‌కు కేటాయించారు. బుధవారం జరిగిన రిలయన్స్‌ ఫ్యామిలీ డేలో ఉద్యోగులనుద్దేశించి ముకేశ్‌ చేసిన ప్రసంగాన్ని గురువారం మీడియాకు సంస్థ విడుదల చేసింది. అందులో ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఏళ్లు గడుస్తున్నాయి, దశాబ్దాలు వెళ్లిపోతాయి.. రిలయన్స్‌ మాత్రం అంతకంతకూ వృద్ధి చెందుతుంది. మర్రి చెట్టు ఎలాగైతే తన శాఖలను మరింత విస్తరించి, ఎంతగా వేళ్లూనుకుంటుందో.. అదే మాదిరి రిలయన్స్‌ కూడా భారతీయులందరి జీవితాలను స్పృశిస్తోంది. వారికి సాధికారత అందిస్తోంది. వచ్చే అయిదేళ్లలో రిలయన్స్‌ తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా కంపెనీ చేరుకోవాల్సిన లక్ష్యాలను ఉన్నతాధికారులు, ఉద్యోగులకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను.


గ్రామాలు, పట్టణాల మధ్య  విభజన రేఖను తుడిచేయాలి

కాశ్‌ అధిపతిగా ఉన్న జియో.. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సిద్ధం చేస్తోంది. ఇంత వేగంగా ప్రపంచంలో ఎక్కడా ఈ సేవలను విస్తరించలేదు. 2023 కల్లా 5జీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌.. భారత తదుపరి అతిపెద్ద అవకాశానికి సిద్ధంగా ఉండాలి. అత్యుత్తమ డిజిటల్‌ ఉత్పత్తులు, పరిష్కారాలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అందించాలి. ప్రతి గ్రామానికి 5జీ సేవలందాలి. సాంకేతికత సేవలు పొందడంలో గ్రామం-పట్టణం అనే తేడా ఉండకూడదు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక కార్యలాపాల్లో అత్యంత నాణ్యత తీసుకురావడం ద్వారా, దేశ అభివృద్ధిలో జియో భాగం కావాలి.


రిటైల్‌తో రైతుల ఆదాయం పెరగాలి

శా ఆధ్వర్యంలోని రిటైల్‌ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో మరింతమందికి చేరువ అవుతోంది. ఇంకొన్ని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం రిటైల్‌ బృందానికి ఉందని నమ్ముతున్నాను. జియోలాగే రిటైల్‌ వ్యాపారాభివృద్ధి వల్ల దేశ వృద్ధిపైనా ప్రభావం కనిపించాలి. మరిన్ని ఉద్యోగాలు రావాలి. రైతులకు అధికాదాయం కలగాలి.


స్వయం సమృద్ధి దేశంగా భారత్‌ మారాలి

దుపరి తరం వ్యాపారంలోకి అనంత్‌ చేరుతున్న ఈ సమయంలో.. జామ్‌నగర్‌లోని మా గిగా ఫ్యాక్టరీల్లో వేగవంతమైన ప్రగతి ఉండేలా చూస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్‌.. అత్యంత పర్యావరణహిత కంపెనీగానూ మారాలి. కొత్త ఇంధన బృందం ముందున్న లక్ష్యం ఇదే. ఇంధన అవసరాలకు దిగుమతులపై ఆధారపడడం తగ్గించి.. భారత్‌ను ఒక స్వయం సమృద్ధి దేశంగా మార్చాలి.


వివేకానందుడి స్ఫూర్తితో..

ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ను అర్జెంటీనా ఎలా గెలిచింది? నాయకత్వం, బృందస్ఫూర్తి కలయిక వల్లే సాధ్యమైంది. మెస్సి సొంతంగా ప్రపంచకప్‌ గెలవలేదు. అలాగే మెస్సి స్ఫూర్తిమంత నాయకత్వం లేకుండా ఆ టీమ్‌ గెలిచేదికాదు. తొలి గేమ్‌లో వెనకబడినా, వాళ్లు వెనకడుగు వేయలేదు. అత్యంత ఉత్కంఠ మ్యాచ్‌లో చివరకు గెలుపు సాధించారు. విజయాన్ని కలగనాలి. దాన్ని సాధించడానికి చేయాల్సిందంతా చేయాలి. ఫుట్‌బాల్‌లో పెనాల్టీ షాట్‌ వరకు విజయం కోసం సమష్ఠిగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే విధంగానే ధీరూభాయ్‌ అంబానీ కూడా రిలయన్స్‌ను నిర్మించారు. ఆయనతో పాటు స్వామి వివేకానంద ఆలోచనలూ నాలో స్ఫూర్తినింపాయి. ‘ఒక ఆలోచనను ఎంచుకోండి. దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. కల కనండి. దాని గురించే ఆలోచించండి. అందులోనే జీవించండి. మీ మెదడు, శరీరం, కండరాలు, నరాలు.. ఇలా శరీరంలో ప్రతి భాగాన్నీ ఆ ఆలోచనతో నింపండి. ఇతర అన్ని ఆలోచనలనూ వదిలేయండి. అదే మీ జీవితాన్ని విజయపథంలో నిలుపుతుంది.’ వివేకానందుడు చెప్పిన ఈ మంత్రాన్ని మనమందరం పఠిద్దాం. అనుసరిద్దాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని