గూగుల్‌కు చుక్కెదురు

అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్‌కు చుక్కెదురైంది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గూగుల్‌పై విధించిన రూ.1337 కోట్ల అపరాధ రుసుముపై మధ్యంతర స్టే విధించడానికి జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిరాకరించింది.

Updated : 05 Jan 2023 05:51 IST

సీసీఐ అపరాధ రుసుముపై స్టే ఇవ్వలేం
రూ.1337 కోట్లలో 10% కట్టండి
ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం

దిల్లీ: అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్‌కు చుక్కెదురైంది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గూగుల్‌పై విధించిన రూ.1337 కోట్ల అపరాధ రుసుముపై మధ్యంతర స్టే విధించడానికి జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిరాకరించింది. ఆ మొత్తంలో 10 శాతాన్ని డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. తన ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) కున్న ఆధిపత్య హోదాను, భారత్‌లో గూగుల్‌ దుర్వినియోగం చేసిందన్నది ఆరోపణ. ఈ విషయమై సీసీఐ విధించిన  అపరాధ రుసుమును సవాలు చేస్తూ గూగుల్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ విచారణకు స్వీకరించి,  ఈ వ్యాఖ్యలు చేసింది. తక్షణం స్టే జారీ చేయలేమని తెలిపింది. సీసీఐకి ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది. సీసీఐ ఆదేశాలపై మధ్యంతర స్టేకు సంబంధించి ఫిబ్రవరి 13న విచారణ చేపడతామని తెలిపింది.
‘స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతాయ్‌’: ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంలో యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి, తమకు ఇష్టమైన సెర్చ్‌ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు గూగుల్‌ వీలు కల్పించాలని సీసీఐ గతేడాది అక్టోబరులో కోరింది. ఈ ఆదేశాలపై తక్షణం స్టే ఇవ్వాలని గూగుల్‌ తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి  అభ్యర్థించారు. సీసీఐ ఆదేశాల వల్ల వినియోగదారు భద్రతకు ఇబ్బంది కలగడంతో పాటు, స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని గూగుల్‌ పేర్కొంది. సీసీఐ ఆదేశాలు ‘పేటెంట్‌ పరంగా తప్పు’, ‘పొరబాట్లతో నిండిపోయినవి’గా ఆయన అభివర్ణించారు. గూగుల్‌ తన ఆధిపత్యాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసిందో సీసీఐ వివరించలేదని అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ 2018లో జారీ చేసిన ఆదేశాల్లో కొంత భాగాన్ని సీసీఐ కాపీ కొట్టినట్లుగా ఉందనీ ఆరోపించారు.
‘అంత తొందరేం ఉంది’: సీసీఐ ఆదేశాలపై సత్వరం స్టే ఇవ్వాలని సింఘ్వి పట్టుపట్టగా.. ‘అంత తొందరేమి ఉంద’ని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, అలోక్‌ శ్రీవాస్తవలతో కూడిన ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం ప్రశ్నించింది. సరైన విచారణ లేకుండా ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేమని స్పష్టం చేసింది. ‘మీరు ఆ ఆదేశాలపై పిటిషన్‌ దాఖలు చేయడానికి రెండు నెలల సమయం తీసుకుని, మమ్మల్ని రెండు నిమిషాల్లో ఆదేశాలు ఇవ్వమని కోరుతున్నారా? ఒకట్రెండు వారాల్లో మీరు ఈ పని చేసి ఉంటే బాగుండేద’ని వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని