ఖరీదైనా పర్లేదు.. కొనేద్దాం

భారత వినియోగదారుల కొనుగోళ్ల వైఖరి మారుతోంది. ఒక పక్క ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ.. కొత్త వాహన కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

Updated : 22 Jan 2023 08:19 IST

వాహన కొనుగోలులో మారుతున్న వినియోగదారుల వైఖరి: డెలాయిట్‌  

దిల్లీ: భారత వినియోగదారుల కొనుగోళ్ల వైఖరి మారుతోంది. ఒక పక్క ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ.. కొత్త వాహన కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఖరీదు ఎక్కువైనా ముందడగు వేస్తున్నారు. రూ.10-25 లక్షల శ్రేణిలో వాహనాలకే అధిక శాతం వినియోగదారులు మొగ్గుచూపుతున్నట్లు డెలాయిట్‌ నివేదిక వెల్లడించింది. ఖర్చుతో పోలిస్తే కంపెనీ అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో కొనుగోలు ధోరణి మారడం స్పష్టమైందని తెలిపింది. కోరుకున్న వాహనం, మెరుగైన అనుభూతి కోసం 4-12 వారాల వరకు సుదీర్ఘ నిరీక్షణ సమయాన్ని సైతం అంగీకరిస్తున్నట్లు వివరించింది. డెలాయిట్‌ 2023 గ్లోబల్‌ ఆటోమోటివ్‌ కన్జూమర్‌ స్టడీ (జీఏసీఎస్‌) పేరిట నివేదికను వెలువరించింది. 2022 సెప్టెంబరు 21-29 మధ్య సర్వే నిర్వహించగా.. భారత్‌లో 1003 మంది కొనుగోలుదార్లు పాల్గొన్నారు.

నివేదికలోని అంశాలు..

* రూ.10-25 లక్షల శ్రేణిలో కార్లు కొనుగోలు చేసేందుకు దాదాపు 47 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. రూ.10 లక్షల లోపు వాటికి 28 శాతం మంది ఇష్టపడుతున్నారు. రూ.10-25 శ్రేణిలో విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేయాలని దాదాపు 57 శాతం మంది భావిస్తుండగా, రూ.10 లక్షల లోపు వాటివైపు 20 శాతం మంది చూస్తున్నారు.

* ఇంతకు ముందు భారత వినియోగదారులు వాహన కొనుగోలు సమయంలో ధర, మైలేజీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు. అయితే ఇప్పుడు వీటిని పట్టించుకోవడం లేదు.

* భారత వినియోగదారుల నుంచి గిరాకీ, అంచనాలు పెరగడాన్ని సర్వే స్పష్టం చేసింది. ఇకపై ధరలపై వినియోగదారులు ఆలోచించేలా లేరని డెలాయిట్‌ తౌచీ తోమిత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీ పార్టనర్‌, ఆటోసెక్టర్‌ లీడర్‌ రాజీవ్‌ సింగ్‌ అన్నారు.

* ఒక బ్రాండ్‌ నుంచి మరో బ్రాండ్‌కు మారే సమయంలో ఉత్పత్తి నాణ్యత (62 శాతం), వాహన ఫీచర్లు (48 శాతం), బ్రాండ్‌ గుర్తింపు (46 శాతం) అంశాలను వినియోగదారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు.

* తక్కువ ఇంధన వ్యయాలు, మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతి, తక్కువ నిర్వహణ వంటి అంశాలు విద్యుత్‌ వాహనాల వైపు వినియోగదారులను నడిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని