IT Jobs: రోజూ 2,800 మందిపై ఐటీ వేటు

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో, వ్యయాలు తగ్గించుకునే మార్గాలను టెక్నాలజీ కంపెనీలు అన్వేషిస్తున్నాయి.

Updated : 23 Jan 2023 07:18 IST

ఫ్రెషర్లూ అప్రమత్తంగా ఉండాల్సిందే

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో, వ్యయాలు తగ్గించుకునే మార్గాలను టెక్నాలజీ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. పెద్ద ఐటీ కంపెనీల వ్యయాల్లో 62-65 శాతం ఉద్యోగుల జీతభత్యాలే అయినందున, తొలుత ఈ విభాగ ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఉద్యోగుల సంఖ్యలో భారీ కోతలు ప్రకటిస్తున్నాయి.

కొవిడ్‌ సమయంలో అధిక నియామకాల వల్లే

కొవిడ్‌ పరిణామాల్లో అనేక రంగాలు, సంస్థలు డిజిటలీకరణ బాట పట్టాయి. లాక్‌డౌన్‌ల వల్ల ఇళ్ల దగ్గర ఖాళీగా ఉన్న ప్రజలు యూట్యూబ్‌లో వీడియోలు చూడటం, సామాజిక మాధ్యమాలు వినియోగించడం గణనీయంగా పెరిగింది. మందులు, నిత్యావసరాల కొనుగోళ్లకు ఇకామర్స్‌ సైట్లను, విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడానికి ఎడ్‌టెక్‌ సంస్థలను ఆశ్రయించడంతో వాటికీ ఉద్యోగుల అవసరం పెరిగింది. ఫలితంగా టెక్‌ సంస్థలు ఎడాపెడా నియామకాలు జరిపాయి. అవసరమైన నైపుణ్యాలున్న వారికి అత్యధిక వేతనాలు ఆఫర్‌ చేశాయి. అంతేనా.. ఒక సంస్థలో ఉద్యోగిగా ఉంటూనే, మరొక సంస్థ ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నా (మూన్‌లైటింగ్‌) చూసీచూడనట్లు వ్యవహరించాయి.  

తొలగింపునకు కారణాలు: కొత్తగా వస్తున్న డిజిటలీకరణ ప్రాజెక్టుల సంఖ్య తగ్గడం, కొవిడ్‌ పరిణామాల తరవాత సామాజిక మాధ్యమాల వినియోగమూ పరిమితం అవుతుండడం, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో విభిన్న రంగాల సంస్థలు తమ టెక్‌ వ్యయాలపై ఆచితూచి వ్యవహరిస్తుండటం.. టెక్‌ కంపెనీలకు కష్టాలు తెచ్చిపెడుతున్న అంశాలు. ప్రాజెక్టులు తగ్గగానే ఆయా కంపెనీలకు సిబ్బంది అధికంగా కనపడుతున్నారు. ఫలితంగా గత ఏడాదిలోనే భారీ కోతలకు తెరలేపారు. 2022లో అంతర్జాతీయంగా 1,000కి పైగా ఐటీ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 1.54 లక్షలని, లేఆఫ్‌లను పరిశీలించే లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ. వెల్లడించింది. ఈనెలారంభం నుంచి 20వ తేదీ వరకు 173 కంపెనీలు 56,000 మందికి పైగా తొలగించాయని.. అంటే సగటున రోజుకు 2,800 మంది ఐటీ నిపుణులపై వేటు పడుతోందని తెలిపింది.  

మనపై ప్రభావం ఇలా: అంతర్జాతీయ టెక్‌ రంగంలో భారతీయ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. దేశీయంగా, అమెరికా, ఐరోపాల్లోనూ భారతీయ సాంకేతిక నిపుణులు ఎంతోమంది పనిచేస్తున్నారు. అందుకే భారత్‌ సహా అంతర్జాతీయంగా అమెజాన్‌ (18,000 కోతలు), గూగుల్‌ (12,000), మెటా (11,000) మైక్రోసాఫ్ట్‌ (10,000) సంస్థలు ప్రకటిస్తున్న నిర్ణయాలు దేశీయంగా పలు కుటుంబాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

విప్రో సంస్థ ప్రాంగణ ఎంపికల్లో నియమించుకుని, శిక్షణ ఇచ్చిన తరవాతా పెద్దగా రాణించని 400 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించడం యువతలో మరింత అప్రమత్తతకు కారణమవుతోంది.

సామాజిక మాధ్యమం షేర్‌చాట్‌ 500 మందిని, ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ఆహారం సరఫరా చేసే స్విగ్గీ 380 మందిని, డిజిటల్‌ ఆరోగ్య సంరక్షణ సేవల సంస్థ మెడిబడ్డీ 200 మందిని, ఓలా 200 మందిని, వేగంగా సరకులు సరఫరా చేసే డుంజో 80 మంది వరకు తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సాఫాస్‌ 450 మందిని అంతర్జాతీయంగా తొలగించనుంది.


అమెరికా ప్రసార మాధ్యమాల్లోనూ కోత

ర్థిక పరిస్థితులు నెమ్మదించిన నేపథ్యంలో, అమెరికా ప్రసార మాధ్యమాల్లోనూ ఉద్యోగ కోతలు మొదలయ్యాయి. సీఎన్‌ఎన్‌ సంస్థ 75 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వాషింగ్టన్‌ పోస్ట్‌ కూడా తమ 2500 మంది ఉద్యోగుల్లో కొంత మందిని తొలగించే అవకాశం ఉందని పేర్కొంది. బజ్‌ఫీడ్‌ 180 మందిని,  వాక్స్‌ సంస్థ 130 మందిని తొలగిస్తామని వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని